కేంద్రం నిధులిచ్చినా.: కాకినాడ-పిఠాపురం రైల్వేలైన్ పనుల నిలిపివేత
కాకినాడ-పిఠాపురం రైల్వే లైన్ను రైల్వే శాఖ నిలిపివేసింది. 2012లో దక్షిణమధ్య రైల్వే జీఎం ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న రైల్వే బోర్డు ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది.
తూర్పుగోదావరి: జిల్లాలోని కాకినాడ-పిఠాపురం రైల్వే లైన్ను రైల్వే శాఖ నిలిపివేసింది. 2012లో దక్షిణమధ్య రైల్వే జీఎం ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న రైల్వే బోర్డు ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. కాకినాడ-పిఠాపురం రైల్వే లైన్ సాధ్యం కాదని 2012 నివేదిక స్పష్టం చేయడం గమనార్హం.
రైల్వే లైన్ ఏర్పాటు తర్వాత ఆర్థిక ప్రగతి కూడా ఉండదని, ఇప్పటికే ఉన్న ఒకే లైన్ విస్తరణ వల్ల కనీసం ఉపయోగం ఉందని సదరు నివేదిక పేర్కొంది. సరుకు రవాణాతో ఆదాయం మరో 50శాతం పెరిగే అవకాశం లేదని స్పష్టం చేసింది.
కాగా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకినాడ-పిఠాపురం రైల్వే లైన్ అభివృద్ధికి నిధులు కేటాయించింది. 2015-16, 2016-17 బడ్జెట్లలో ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ.. ఈ రైల్వే లైన్ నిలిపేస్తున్నట్లు బోర్డ్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఆ మార్గంలో ప్రస్తుతం చేపడుతున్న పనులు నిలిపేయాలని ఆదేశాలు కూడా జారీ చేయడం గమనార్హం.