పార్టీ మారితే ఉపఎన్నిక లేదు: కెసిఆర్పై పరోక్షంగా కళా, 8న అవిశ్వాసం: శ్రీకాంత్
విజయవాడ: పార్టీలు మారిన వారు రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళ్లవలసిన అవసరం లేదని ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పరోక్షంగా తెలంగాణ సీఎం కెసిఆర్ను, ఆయన స్థాపించిన తెరాస పార్టీని ఉద్దేశించి మాట్లాడారు.
గత పదేళ్లలో ఉప ఎన్నికలతో తెలుగు ప్రజలు పడ్డ ఇబ్బంది చాలని తెరాసను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు అభివృద్ధికి ఆటంకమని చెప్పారు. ఇటీవల ఏపీలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. వారు రాజీనామా చేయాలని, ఉప ఎన్నికలు కావాలని వైసిపి డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు పైవిధంగా స్పందించారు. సాక్షి పత్రిక కథనాలు, వైసిపి నేతల ఆరోపణల పైన కూడా కళా వెంకట్రావు స్పందించారు. అమరావతి పైన జగన్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. నారా లోకేష్ పైన హ్యాయ్ లాండ్ విషయంలో దుష్ప్రచారం సరికాదన్నారు. అటాచ్మెంట్ ఉన్న ఆస్తులను కొనుగోలు చేశారని చెప్పడంలోనే దుష్ప్రచారం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
చంద్రబాబు సారీ చెప్పాలి: శ్రీకాంత్ రెడ్డి
ఈ నెల 8వ తేదీన ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని వైసిపి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు చెప్పారు. అసెంబ్లీలో ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతామన్నారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం ఏం పని చేసిందో చెప్పాలన్నారు. ఒక్క పని కూడా చేయలేదన్నారు.
పట్టిసీమ ద్వారా రాయలసీమకు ఒక్క చుక్కు నీరు ఇచ్చారా అని నిలదీశారు. రాయలసీమ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ను కాస్త స్కామ్ ఆంధ్రప్రదేశ్గా మార్చారని వైసిపి ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు.