అసెంబ్లీలో జగన్కి టిడిపి, బాబుకి వైఎస్సార్సీపీ చురకలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మంగళవారం హత్యారాజకీయాలపై రగడ రాజుకుంది. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లాలో టిడిపి కార్యకర్తలను ఊచకోత కోశారని టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకని టిడిపి కార్యకర్తలు బతికారన్నారు. దాదాపు 400 మంది సమక్షంలో, ఎస్పీ ఆఫీసుకు కూతవేటు దూరంలో పరిటాల రవిని హత్య చేశారన్నారు.
వైయస్ మరణానంతరం ఈ హత్యాకాండను ఎవరు కొనసాగిస్తారో అన్న ఆలోచనలో అనంతపురంవాసులు ఉన్నారన్నారు. ఒకానొక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పరిటాల రవి హత్య కేసు నుంచి జగన్ను కాపాడటానికి ఎంతో కష్టపడాల్సి వస్తోందని అసెంబ్లీ సాక్షిగా అన్నారని చెప్పారు.

ఈ సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మాట్లాడబోయారు. దీంతో, నాగిరెడ్డిగారూ మీరు కూడా హత్యారాజకీయాల గురించి మాట్లాడతారా అంటూ కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.
కాగా, జగన్ తన వైఖరి మార్చుకోవాలని కాల్వ అన్నారు. ప్రజల పక్షాన నిలబడిన టిడిపిని, చంద్రబాబును విమర్శించడమే జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రజలకు మంచి చేసే పనులకు సహకరించాలని హితవు పలికారు. తన తప్పులు, అవినీతి, కుంభకోణాలు అన్నింటినీ ఇతరులకు కూడా అంటగట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారన్నారు. హింస, దౌర్జన్యాలు, అవినీతి, కుంభకోణాలు ఇవన్నీ చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో చిత్తుగా ఓడించారన్నారు. ఈ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యలు గందరగోళానికి దిగారు. కాంగ్రెస్ను అంటే మీకెందుకు బాధ? అంటూ కాల్వ చురక వేశారు.
జగన్ వర్సెస్ యనమల
చంద్రబాబును ఆయన అని జగన్ వ్యాఖ్యానించడంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. అవినీతిపై జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అని దుయ్యబట్టారు. సభలో ఉన్నవాళ్లలో ఎవరూ 16 నెలలు జైలులో లేరని, సిబిఐ కేసుల్లో నిందితులుగా లేరని యనమల ఎద్దేవా చేశారు.
అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ.. అవినీతిపై నిరంతరాయంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. హసన్ అలీకి సంబంధించిన వివరాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వొచ్చన్నారు. రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం ముద్రించి అవినీతిపై పోరాటం చేశామన్నారు. దీనిపై జగన్ స్పందిస్తూ... చంద్రబాబుపై కమ్యూనిస్టు పార్టీలు ముద్రించిన పుస్తకంపై కూడా చంద్రబాబు ప్రస్తావిస్తే బాగుండేదన్నారు.
కాగా, ఈ రోజు పోలవరం ప్రాజెక్టు, విదేశాల్లోని నల్లధనం, ఎవరెస్టు అధిరోహించిన విద్యార్థులపై అభినందన తీర్మానం ప్రవేశ పెట్టారు.












Click it and Unblock the Notifications