రోజా వ్యవహారశైలి గొడ్డలి పెట్టు: కామినేని, కెసిఆర్ యాగానికి బాసట
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు రోజా వ్యవహారశైలి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.. సొంతపార్టీ వైఖరిని సభలో చెప్పాలి తప్ప
సభ్యులపై వ్యక్తిగత దూషణ సరికాదని ఆయన అన్నారు.
స్పీకర్పై అవిశ్వాస తీర్మానం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనాలోచిత నిర్ణయమని ఆయన అన్నారు. వైద్యరంగంలో సాంకేతిక నైపుణ్యం పెంచాలన్నరాష్ట్రపతి ఆదేశాలను ఏపీ ప్రభుత్వం అమలుచేస్తోందని మంత్రి వివరించారు. అయుత చండీయాగం నిర్వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఆయన బాసటగా నిలిచారు. ఆయుత చండీయాగం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజల ఆయురారోగ్యం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.
స్పీకర్పై అవిశ్వాస తీర్మానం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బాధ్యతారాహిత్యమని తెలుగుదేశం పార్టీ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ జరిగేటప్పుడు తీర్మానం ఇస్తే దానికి విలువ ఉండేదన్నారు. మొన్న బలం లేదన్న జగన్ అవిశ్వాసానికి ఎలా సిద్ధపడ్డారని ప్రశ్నించారు. రౌడీ స్పీకర్ అనడం దారుణమని మండిపడ్డారు. వైసీపీని ప్రజలు ఛీకొడతారని కాల్వ వ్యాఖ్యానించారు.
కోడెల సీనియర్ లీడర్, ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని కాల్వ ధ్వజమెత్తారు. వైసీపీకి వ్యూహమే లేదు, కేవలం పబ్లిసిటీ స్టంటే అని ఆయన అన్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలను అసెంబ్లీలో జగన్ మాట్లాడలేదని, సభా సమయాన్ని జగన్ వృథా చేశారని కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.