రుజువు చేస్తే రాజకీయ సన్యాసం: ఆ ఆరోపణలపై కామినేని సవాల్, భావోద్వేగం
తనపై వస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన మంత్రి పదవినేకాదు, రాజకీయాలనే వదిలేస్తానని తేల్చి చెప్పారు.
గుంటూరు: తనపై వస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన మంత్రి పదవినేకాదు, రాజకీయాలనే వదిలేస్తానని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరు వైద్య కళాశాలలో ఆదివారం మంత్రి కామినేనికి ఘన సన్మానం జరిగింది.
మంత్రి కామినేని
ఈ సందర్భంగా మంత్రి కామినేని భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఇటీవల కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లలో వ్యక్తిగతంగా నా మీద, ఆరోగ్య శాఖపై అవినీతి ఆరోపణలతో కథనాలు వస్తున్నాయి. దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి' అని తెలిపారు.
వారే ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారు..
దీర్ఘకాలంగా ఆరోగ్య శాఖలో కొందరు అవినీతికి అలవాటు పడ్డారనీ, ప్రమోషన్లు, బదిలీలు, డిప్యుటేషన్ల ఆధారంగా అక్రమ సంపాదన పొందేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చిన తర్వాత వారిని దూరం పెట్టానని చెప్పారు. బదిలీలు, ప్రమోషన్లు, రిక్రూట్మెంట్లు పారదర్శకంగా నిర్వహిస్తూ వారికి అడ్డు కట్ట వేశానని వివరించారు.
బురద జల్లేందుకే ఇలా..
ఈ క్రమంలోనే వారు ఉక్రోషంతో రాజకీయంగా తనపై బురద చల్లేందుకు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. తన అవినీతిని రుజువు చేయమని తాను డిమాండ్ చేయనని, కనీసం తాను అవినీతికి పాల్పడినట్లు రాజకీయాలతో సంబంధం లేని సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న పెద్దలతో చెప్పించండని అన్నారు.
రాజకీయల నుంచి తప్పుకుంటా..
లేదంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేరారోపణలో వాస్తవం ఉన్నట్లు కమిషన్ ప్రాథమికంగా నిర్ధారించినా తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మంత్రి కామినేని శ్రీనివాస్ సవాల్ విసిరారు.