48గంటల్లో అయ్యేది కాదు: పవన్ హెచ్చరికపై మంత్రి కామినేని స్పందన
ఉద్ధానం కిడ్నీ సమస్య 48గంటల్లో తీరేది కాదని, అది దీర్ఘకాలికమైందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.
శ్రీకాకుళం: ఉద్ధానం కిడ్నీ సమస్య 48గంటల్లో తీరేది కాదని, అది దీర్ఘకాలికమైందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజు రోజుకు రిమ్స్ అధ్వాన్నంగా తయారవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యుల పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని మెచ్చరించారు.
ఉద్ధానం కిడ్నీ సమస్య వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదని అన్నారు. కిడ్నీ బాధితులకు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ ప్రాంత కిడ్నీ బాధితుల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
అయితే, సమస్యకు పరిష్కారం 48గంటల్లో లభించదని, దీర్ఘకాలికంగా ప్రక్రియ కొనసాలని అన్నారు. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కిడ్నీ వ్యాధి బాధితుల గురించి మాట్లాడిన అనంతరం మంత్రి పైవిధంగా స్పందించారు.
గత రెండ్రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్ శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంలో ఉద్ధానం కిడ్నీ బాధితులను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వాలు కిడ్నీ బాధితులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై 48గంటల్లోగా ప్రభుత్వం తమ స్పందనను తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తానే ముందుండి ఉద్యమం చేస్తానని హెచ్చరించారు.