కన్నా నివాసానికి నాదెండ్ల - జనసేనలోకి ఆహ్వానం..!? పొత్తుపై ప్రభావం..!
బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు..మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కేంద్రంగా ఆసక్తి కర రాజకీయం చోటు చేసుకుంటోంది. కన్నా ఇంటికి జనసేన కీలక నేత మనోహర్ రావటం ఉత్కంఠను పెంచుతోంది. బీజేపీ - జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఇది సాధారణ సమావేశమే అని చెబుతున్నా..దీని వెనుక ఉన్న రాజకీయం మాత్రం ఆసక్తిగా కనిపిస్తోంది.
బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు పైన కొద్ది రోజుల క్రితం కన్నా కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ భేటీ ద్వారా కన్నా కు జనసేనలోకి రూటు క్లియర్ అయిందని విశ్వసనీయ సమాచారం. అయితే, బీజేపీ నేతలనే జనసేన తమ పార్టీలోకి తీసుకోవటం అధికారమైతే..పొత్తు మీద ప్రభావం చూపటంతో పాటుగా.. ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీయం ఖాయంగా కనిపిస్తోంది.
జనసేనలోకి కన్నా ఎంట్రీ ఖాయం..!?
కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నార. కానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్ల అసహనంగా ఉన్నార. జనసేనతో పొత్తు కొనసాగిస్తున్నా.. పవన్ ఒక దశలో చంద్రబాబుకు దగ్గరవుతున్నారనే సంకేతాలు కనిపించాయి. ఆ సమయంలో కన్నా ఆవేదన వ్యక్తం చేసారు. సోము వీర్రాజు తీరు కారణంగానే పవన్ దూరం అవుతున్నారనే అభిప్రాయం కన్నా వ్యక్తం చేసారు. ఆ దశలో ఆయన జనసేన వైపు ఆసక్తిగా ఉన్నారనే వాదన వినిపించింది. కానీ, బీజేపీ కీలక నేతల జోక్యంతో కన్నా సైలెంట్ అయ్యారు. అటు వీర్రాజు కూడా కన్నా వ్యాఖ్యల పైన స్పందించ లేదు.
విశాఖ కేంద్రంగా ప్రధానితో జనసేన అధినేత పవన్ సమావేశం తరువాత టీడీపీ -జనసేన మధ్య పొత్తు ఉండదని, బీజేపీతో పవన్ ఉంటారనే చర్చ మొదలైంది. కానీ, నెల గడుస్తున్నా..ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య ఒక్క సమావేశం కూడా జరగలేదు. ఇదే సమయంలో జనసేన సొంతంగా తమ బలం పెంచుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
బీజేపీ నేతలే జనసేనలోకి వెళ్తే...
కన్నా లక్ష్మీనారాయన బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జనసేనతో పొత్తు ఖరారైంది. జనసేనతో పొత్తు కొనసాగాలనేది కన్నా లక్ష్యం. అయితే, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరాణల నేపథ్యం లో కన్నా పార్టీ ఆలోచన మారిందని..జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ స్వయంగా కన్నా ఇంటికి రావటం..ఇద్దరూ సమావేశం కావటం ద్వారా జనసేనలోకి కన్నాను ఆహ్వానించేందుకు మనోహర్ వచ్చారనే చర్చ సాగుతోంది.
అయితే, బీజేపీ తో మిత్రపక్షంగా ఉన్న సమయంలో కమలం పార్టీ నేతలను జనసేనలోకి ఆహ్వనిస్తే మైత్రి మీద ప్రభావం పడుతుందనే వాదన ఉంది. అయినా..ఇప్పుడు మనోహర్ - కన్నా తో భేటీ సాధరణమనే చెబుతున్నా..భవిష్యత్ నిర్ణయాల కోసమేనని విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు బీజేపీలోని ఏ నేత ఇంటికి జనసేన నేతలు వెళ్లలేదు. ఇప్పుడు కన్నా తో నాదెండ్ల భేటీ వెనుక పార్టీ మార్పు అంశమే ప్రధానమని ప్రచారం సాగుతోంది.
పొత్తు పై ఎఫెక్ట్ - కొత్త సమీకరణాలు
ఇప్పుడు కన్నాతో నాదెండ్ల భేటీ తో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కన్నా కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న సమయంలో..మనోహర్ స్పీకర్ గా ఉన్నారు. ఇద్దరూ ఒకే జిల్లా రాజకీయ నేతలు. బీజేపీ - జనసేన పొత్తు సమయంలో ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు. ఇక, ఇప్పుడు కన్నా బీజేపీ నుంచి జనసేనలోకి చేరితే రాజకీయంగా ఏపీలో కొత్త సమీకరణాలకు నాంది కానుంది. దీని కారణంగానే మర్యాద పూర్వక భేటీగానే పైకి చెబుతున్నట్లుగా కనిపిస్తోంది.
బీజేపీ నుంచి జనసేన చేరికలను ప్రోత్సహిస్తుందనే అభిప్రాయం ఏర్పడుతుంది. దీంతో ఇప్పుడు కన్నాతో మనోహర్ భేటీ లో ఏం జరుగుతోంది.. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు..ఈ భేటీ రెండు పార్టీల పొత్తు పైన ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.