భగ్గుమన్న బీజేపీ విభేదాలు? అధ్యక్షుణ్ని మారుస్తున్నారా?
భారతీయ జనతాపార్టీలో ఇప్పటివరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటున్న బీజేపీ అగ్రనేతలకు తమ పార్టీ ఏపీలో క్షేత్రస్థాయిలో ఎలా ఉందో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ తరహా నాయకత్వంతో అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయంలో ఉండటంతోనే సమస్యలను గుర్తించడానికి, వాటిపై పోరాటానికి కమిటీని నియమించి ఐవైఆర్ కృష్ణారావుకు బాధ్యతలు అప్పగించారు.
పవన్ చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు
మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే బీజేపీలో ఉన్న విభేదాలను బహిర్గతం చేశాయి. తనకు బీజేపీ నుంచి సరైన మద్దతు లభించడంలేదని, రోడ్ మ్యాప్ అడిగినా పట్టించుకోవడంలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తర్వాత చంద్రబాబు పవన్ తో భేటీ అవడం రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. ఇప్పటివరకు బీజేపీలో సోము వీర్రాజు అంటే గుర్రుగా ఉన్న నేతలంతా ఒక్కసారిగా బయటకు వస్తున్నారు.
సోము వీర్రాజు నాయకత్వంలోనే..
ఇటీవలే పార్టీ ఇన్ ఛార్జి సునీల్ ధియోధర్ ఎన్నికలను సోము నాయకత్వంలోనే ఎదుర్కోబోతున్నామని ప్రకటించారు. వాస్తవానికి మరో రెండు నెలల్లోపు పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉండబోతోంది. ఈ పదవికి మరోసారి సోముతోపాటు పార్టీ జాతీయనేత సత్యకుమార్ పోటీపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ధియోధర్ ప్రకటన పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు రుచించలేదు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ వెళితేనే ఢిల్లీ పెద్దలు పెట్టుకున్న 2029 లక్ష్యం నెరవేరుతుందని, కానీ పార్టీని ఎదగనివ్వకుండా తాము మాత్రమే ఎదుగుతున్న నేతలున్నంతకాలం బలోపేతం కాదనేది పార్టీలోనే కొందరు నేతల అభిప్రాయంగా ఉంది.
పవన్ దూరం జరిగితే వీర్రాజే బాధ్యడు!
మీడియాతో మాట్లాడిన కన్నా తమ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అధిష్టానం జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీర్రాజు పవన్ కల్యాణ్ తో సమన్వయం చేసుకోలేకపోయారని, రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు.
సమస్య మొత్తం సోము వీర్రాజు దగ్గరే ఉందని, అన్నీ ఒక్కడే చూసుకోవడంవల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడంలేదన్నారు. ఒకవేళ బీజేపీకి పవన్ దూరం జరిగాడంటే దానికి కారణం వీర్రాజేనని కన్నా స్పష్టం చేశారు. కన్నా చేసిన వ్యాఖ్యలను పార్టీ పరిశీలిస్తుందా? లేదా? అనే విషయమై కొద్దిరోజుల్లోనే స్పష్టత రానుంది.