సీనియర్ నేతను వేరే పార్టీలోకి పంపిస్తున్న మోడీ, అమిత్ షా?
భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడే యోచనలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వ పనితీరుపై కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశమైన తర్వాత ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలంటూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకత్వం అలసత్వ వైఖరివల్లే తెలుగుదేశం పార్టీకి అలాంటి అవకాశం వచ్చిందంటూ పార్టీలోని ముఖ్యనేతల వ్యవహారశైలిపై కన్నా గుర్రుగా ఉన్నారు.
సోము ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు!
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయంతో కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టినా సీనియర్ నేతగా తనకు కనీస సమాచారం కూడా ఇవ్వడంలేదని, తన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆగ్రహంతో ఉన్నారు.
ఈ విషయాన్ని ఆయన బీజేపీ అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లినా అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకోవాలని భావించారు. రెండురోజుల క్రితం విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ కేంద్రంగా జరిగిన ఘటనల అనంతరం సోము వీర్రాజు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఒక్కరే వెళ్లి కలిశారని, పార్టీ శ్రేణులంతా దీనిపై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమైన అనుచరులతో భేటీ
తాజా పరిణామాల నేపథ్యంలో మొదటి నుంచి తనతో కలిసి నడుస్తున్న అనుచరులతో కన్నా సమావేశం కాబోతున్నారు. 30 సంవత్సరాలుగా తనతోపాటు రాజకీయాల్లో కొనసాగుతోన్న 15 మంది కీలక నేతలకు ఆయన ఆహ్వానాన్ని పంపించారు. గుంటూరు కన్నావారితోటలోని నివాసంలో సమావేశం జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనుచరులతో భేటీ అయిన తర్వాత కన్నా తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
టీడీపీనా? జనసేనా?
కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపించడంలేదు. మొదటి నుంచి జగన్ తీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్న కన్నా లక్ష్మీనారాయణ అమరావతికే మద్దతు తెలియజేస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తేవారు. కాలక్రమేణా ఆయన చంద్రబాబుతో సత్సంబంధాలు నెరపుతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ సొంత సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆ వైపు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఏదేమైనప్పటికీ దీనిపై అతి తొందరలోనే స్పష్టత రానుంది.