జగన్ పైరవీ వల్లే టి: కన్నా, నరికివేతపై విహెచ్ కౌంటర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బిజెపితో చేసిన పైరవీ ఫలితంగానే రాష్ట్ర విభజన జరిగిందని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. తెలంగాణలో ఏమాత్రం బలం లేని జగన్ విభజన జరిగితే సీమాంధ్రలో విజయం సాధించవచ్చుననే భావనతోనే బిజెపితో అవగాహన కుదుర్చుకున్నారని ఆరోపించారు.
జగన్ది పైకి మాత్రమే సమైక్యవాదమని, లోలోన విభజన వాది అన్నారు. తెలుగుదేశం పార్టీ రెండు ప్రాంతాల్లో రెండు రకాలుగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. బిజెపితో కలిసి విభజనను ఆపి సీమాంధ్రలో ప్రయోజనం పొందాలని చంద్రబాబు నాయుడు చూశారని ఆరోపించారు. బిజెపి జగన్, చంద్రబాబుల వ్యవహారాన్ని పరిశీలించి జగన్ వైపే మొగ్గు చూపిందన్నారు.
జగన్ పైన విహెచ్ మండిపాటు
కాంగ్రెసును నరికేయాలన్న జగన్ పైన రాజ్యసభ సభ్యులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. మీ తాత రాజా రెడ్డి నరికి... నరికి చివరకు నరికివేతకు గురైన విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాయలసీమలో ఎంతోమందిని నరికేసిన చరిత్ర ఉన్న తాత అలవాటును జగన్ ఇంకా మరిచిపోయినట్లు లేదని ఎద్దేవా చేశారు.
సోనియా గాంధీ శాంతస్వభావి అని కాబట్టే సీమాంధ్రులతో అన్నదమ్ముల్లా ఉండమని సూచించారని, జగన్లా నరికివేయమని చెప్పలేదన్నారు. నరికివేయడం, బాంబులేయడం లాంటి సంస్కృతి వచ్చిన ఇలాంటి నాయకత్వాన్ని సీమాంధ్రులు ఎలా అంగీకరిస్తారన్నారు.