వైసీపీ పాలన.. అరాచక పాలన .. ఇది ఊహించే 2014లో వైసీపీని ప్రజలు దూరం పెట్టారన్న కన్నా
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడుతున్నారు . గత ప్రభుత్వం టీడీపీ హయాంలో నష్టపోయిన ప్రజలకు ఇప్పుడు వైసీపీతో కూడా నష్టం జరుగుతుందని విమర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా ఏ విధమైన అభివృద్ధి జరగలేదని , అరాచక పాలన మినహాయించి సీఎం జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని మండిపడ్డారు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ .
ఏపీలో ప్రజల అంచనాలను జగన్ సర్కార్ అందుకోలేకపోయింది : మురళీధరరావు
ప్రతీకార దాడులు.. అస్తవ్యస్త పాలన తప్ప వైసీపీ పాలనలో ఇంకేం లేదు అన్న కన్నా లక్ష్మీ నారాయణ
ఫ్యాక్షనిజం... ప్రతీకార దాడులు, అస్తవ్యస్త పాలన, దోపిడి ఇవన్నీ వైసీపీ అధికారంలోకి వస్తే వస్తాయని 2014లో ప్రజలు ఊహించినందువల్లే ఆ ఎన్నికల్లో జగన్ను దూరం పెట్టారని పేర్కొన్నారు. అయితే పాదయాత్రలో ఇచ్చిన హామీలు చూసి మనిషిలో మార్పు వచ్చిందని భావించారని, దానికి తోడు టీడీపీ కూడా అవినీతిలో కూరుకుపోవటం వల్లే జగన్కు అధికారం దక్కింది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతనే లేదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు . జగన్ అనుభవరాహిత్యం, ఫ్యాక్షన్ మైండ్ సెట్ రాష్ట్రంలో దారుణ పరిస్థితులను సృష్టించాయని ఆయన పేర్కొన్నారు.
సీఎం అనాలోచిత నిర్ణయాలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కావటానికి కారణం
ప్రభుత్వం కులాలు, మతాలకు అతీతంగా పాలన అందించాలని వ్యాఖ్యానించారు. కానీ జగన్ సర్కార్ అలా ప్రవర్తించటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ వంద రోజుల పాలన సందర్భంగా గుంటూరులో ఆయన మాట్లాడారు. సీఎం అనాలోచిత నిర్ణయాలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కావడానికి కారణమని అభిప్రాయపడ్డారు. కొత్త ఇసుక విధానం కోసం జగన్ తీసుకున్న నిర్ణయం తప్పని పేర్కొన్నారు . ఇసుకలో అవినీతిని ఆపుతానని చెప్పి ఇసుకనే బ్యాన్ చేసి పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు .
పాలనలో పట్టు కోల్పోయిన సీఎం జగన్ అని కన్నా మండిపాటు
కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించడంలో ఉన్న శ్రద్ధలో కనీసం 5 శాతం ఇసుక పాలసీని నిర్థారించడంపై పెడితే రాష్ట్రంలో ప్రస్తుతం ఇలాంటి దుస్థితి వచ్చేది కాదన్నారు. 100 రోజుల్లోనే పాలనపై పట్టు కోల్పోయారన్నారు. సీఎం జగన్ బయటికి ఒక మాట, లోపల అధికారులకు మరో మాట చెబుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు . ఇటీవల వర్షాలు, వరదల వల్ల వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకోవడం చేతకాక రాయలసీమలో కరువును పెంచారన్నారు. పోలవరం నిర్మాణం చేతకాకుంటే కేంద్రానికి అప్పగించాలని చెప్పారు.
దమ్మున్నవారు జగన్ పాలనలో చేసిన మంచి పని చెప్పాలని సవాల్ .. 16న వైసీపీ అరాచకపాలనపై ధర్నా
వైసీపీ వంద రోజుల పాలనలో ఒక్క మంచి పని చేసిన దాఖలాలు లేవన్నారు. ఉంటే దమ్మున్నవారు చెప్పవచ్చని సవాలు విసిరారు. వంద రోజుల క్రితం 151 సీట్లు ఇచ్చిన ప్రజలపై ప్రస్తుతం నమ్మకం లేకనే స్థానిక ఎన్నికలకు భయపడుతున్నారన్నారు.అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు వెనక్కి పోవటం జగన్ పుణ్యమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడంతోనే రుణం విషయంలో ప్రపంచబ్యాంకు వెనక్కు తగ్గిందని కన్నా ఆరోపించారు. ఏపీ విభజన సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీలను ఐదేళ్లలోనే పూర్తిచేశామని కన్నా స్పష్టం చేశారు. కానీ ఏపీలో ప్రభుత్వ పనితీరు బాగా లేదన్న కన్నా ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఉద్యమిస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ నెల 16న వైసీపీ అరాచకపాలనపై ధర్నా చేస్తామని ప్రకటించారు.