టీడీపీ ఆఫీసు అద్దెకు, చంద్రబాబుకు విశ్రాంతి: ఏపీ మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి సెటైర్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా కొనసాగింది. పోటీయే లేదన్నట్లుగా కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విజయభావుటా ఎగురవేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంచుకోట అయిన కుప్పంలోనూ వైసీపీ జెండా ఎగిరింది. దీంతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
టీడీపీ కనుమరుగే.. బాబుకు బుద్ధి చెప్పారు: కన్నబాబు
ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు స్వీయ తప్పిదాలే టీడీపీ పతనానికి కారణమని ఆరోపించారు.
చంద్రబాబు అమరావతి ఒక్కటే తన ఎజెండా అనుకున్నారని, అందుకే మిగతా ప్రాంతాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఇప్పుడైనా వాస్తవ పరిస్థితులను చంద్రబాబు గమనించాలని హితవు పలికారు. కుప్పం ప్రజలు వాస్తవాలను గుర్తించే చంద్రబాబును పక్కన పెట్టారన్నారు. రానున్న కాలంలో టీడీపీ కనుమరుగవుతుందని మంత్రి కన్నబాబు జోస్యం చెప్పారు.
టీడీపీ ఆఫీసు ఇక అద్దెకే.. : మంత్రి వెల్లంపల్లి
మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభంజనమన్నారు. చంద్రబాబు కుప్పం కోట బద్దలు అయ్యిందన్నారు. ఇక, టీడీపీ ఆఫీసును అద్దెకు ఇచ్చుకోవాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి మనవడితో ఆడుకుంటే మంచిదని సూచించారు. జగన్.. చంద్రబాబును కుప్పం మున్సిపాలిటీ స్థాయికి దిగజార్చారని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.
ఏపీ వైసీపీ అడ్డా అంటూ మంత్రి వెల్లంపల్లి
చంద్రబాబు, లోకేష్, కుటుంబ సభ్యులు అందరూ ప్రచారం చేయాల్సిన పరిస్థితి కుప్పంలో వచ్చిందన్నారు మంత్రి వెల్లంపల్లి. అయినా కుప్పంలో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి కుప్పం ప్రజలు వైసీపీకే పట్టం కట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ అడ్డా... వేరే పార్టీలకు స్థానమే లేదు అని తేలిపోయిందని చెప్పుకొచ్చారు. కుప్పంలో లోకేష్ వీధి వీధి తిరగి... గొడవలు చేయటానికి ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 2019 నుంచి ఏ ఎన్నికైనా వైసీపీలో అదే జోష్ కొనసాగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఎదురులేని ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. చంద్రబాబు, టీడీపీ పనైపోయిందని అంటున్నారు. మరికొందరైతే ఇక టీడీపీని నందమూరి వారసులకు ఇచ్చేసి చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.