5ని.ల్లో ఇలా.. పరిష్కరించొచ్చు: ఉండవల్లి, మరింత క్షీణించిన ముద్రగడ ఆరోగ్యం
విజయవాడ/రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఐదు నిమిషాలలో పరిష్కారమయ్యే సమస్యను చంద్రబాబు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు ఆలోచిస్తారనే విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన పని లేదని అన్నారు. ముద్రగడ పద్మనాభం దీక్షను విరమింప చేయడం చిటికెలో పని అన్నారు. కానీ చంద్రబాబుకు అలా చేయడం ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు.
నువ్వేం చేశావ్: చిరంజీవిపై అనిత ఫైర్, ఇదీ ముద్రగడ ఆరోగ్య పరిస్థితి.
తుని ఘటనలో కేసులు ఎదుర్కొంటున్న వారిని విడుదల చేయడం ఒకరోజు పని అన్నారు. ప్రభుత్వం కేసుల పెట్టిన వారు బెయిల్కు దరఖాస్తు చేసుకుంటారని, అవి విచారణకు వచ్చినప్పుడు జడ్జి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగితే, ప్రభుత్వం అభ్యంతరం లేదని చెబితే వారికి బెయిల్ మంజూరవుతుందన్నారు.
మధ్యాహ్నానికి ష్యూరిటీల వస్తాయని, సాయంత్రానికి ఆర్డర్లు రెడీ అవుతాయని, ఆ తర్వాత వారు బయటకు వస్తారన్నారు. ఇంతమాత్రానికి ముద్రగడను వేధించవలసిన అవసరం లేదన్నారు. కానీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా చేస్తోందన్నారు. గతంలో కులం పేరు చెప్పి రాయబారం నడిపిన వారు ఆయనను మోసం చేశారని, అందుకే ఆయన ప్రభుత్వాన్ని నమ్మడం లేదన్నారు.

ముద్రగడకు తక్షణమే వైద్య సేవలు అవసరం
ముద్రగడ దీక్ష బుధవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని వైద్యులు ఈ రోజు తెలిపారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వైద్య పరీక్షలకు ముద్రగడ పద్మనాభం అంగీకరించడం లేదన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందన్నారు. ఆయనకు తక్షణం వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనకు బలవంతంగా వైద్యం చేసే పరిస్థితిలో లేమన్నారు.
ముద్రగడ ఎఫెక్ట్: చిరంజీవి, దాసరి సమక్షంలో 'మీడియా' ఆలోచన
ఇదిలా ఉండగా, ముద్రగడ పద్మనాభం తాజాగా చేపట్టిన ఆమరణ దీక్షపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో మంగళవారం నాడు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ముద్రగడ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలు కాగా, ముద్రగడకు మెరుగైన వైద్యం కోరుతూ రెండో పిటిషన్ దాఖలైంది.












Click it and Unblock the Notifications