లాబీయింగ్ చేస్తున్నారా: హాట్గా మారిన కాపు కార్పోరేషన్ ఎండీ పోస్ట్?
విజయవాడ: కాపులకు రిజర్వేషన్ల పేరిట మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం 'కాపు గర్జన' సభ, ఆయన దీక్ష నేపథ్యంలో.. కాపు కార్పోరేషన్ ఎండీ పోస్ట్ హాట్గా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో... చంద్రబాబు కాపులను బీసీలలో చేర్చుతామని హామీ ఇచ్చారు.
ఆ హామీ ఇరవై నెలలు అయినా నెరవేరడం లేదని ఇటీవల ముద్రగడ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. దానిని ఏర్పాటు చేసారు. తొలి వితగా రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఇందులో రూ.50 కోట్లను ఇప్పటికే విడుదల చేశారు. కాపు కార్పోరేషన్ చైర్మన్గా చలమశెట్టి రామాంజనేయులును నియమించారు. అయితే, కార్పోరేషన్లో కీలక పదవి అయిన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) పోస్టును బీసీ కార్పోరేషన్ ఎండీకి అదనపు బాధ్యతగా అప్పగించారు.
ముద్రగడ దీక్ష నేపథ్యంలో కాపు కార్పొరేషన్ బడ్జెట్ను ప్రస్తుతానికి రూ.500 కోట్లకు పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది రూ.1000 కోట్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ నిధుల వ్యయంలో ఎండీదే కీలక భూమిక. దీంతో ఏడాదికి వెయ్యి కోట్ల నిధులు రానున్న కాపు కార్పొరేషన్కు ఎండీగా వెళ్లేందుకు అర్హత ఉన్న అధికారులు తమవంతు యత్నాలు ప్రారంభించారు.