విధ్వంసానికి దారి తీసిన కాపు గర్జన: రైలు దగ్ధం, స్తంభించిన రహదారులు
కాకినాడ: కాపు రిజర్వేషన్ల సాధన కోసం శనివారం ఏర్పాటైన కాపు గర్జన సదస్సు హింసాత్మకంగా మారింది. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో తునిలో ఏర్పాటైన సభకు వేలాదిగా కాపు కార్యకర్తలు తరలి వచ్చారు. సభలో మాట్లాడుతూ రైలు పట్టాల మీదికి పోయి ఉద్యమాన్ని సాగిద్దామని ముద్రగడ చెప్పిన వెంటనే వేలాదిగా కార్యకర్తలు రైలు పట్టాల మీదికి తరలిచారు.
రిజర్వేషన్లు సాధించే వరకు ఇంటికి వెళ్లడానికి వీల్లేదంటూ ముద్రగడ పద్మనాభం పిలుపునివ్వడంతో ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. తుని సమీపంలోన రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలును ఆందోళనకారులు దగ్ధం చేశారు. నలుగురు రైల్వే సిబ్బంది గాయపడ్డారు. పట్టాలపైకి కార్యకర్తలు చేరడంతో రైళ్లు ఆగిపోయాయి. ఆ ప్రాంతంలో వాహనాలు కూడా నిలిచిపోయాయి. ప్రయాణికులను దించేసి రైలును ఆందోళనకారులు దగ్ధం చేశారు. తునికి ఐదు కిలోమీటర్ల దూరంలో రైలు దగ్ధం జరిగినట్లు తెలుస్తోంది.
వేలాదిగా కాపులు జాతీయ రహదారి మీదికి వచ్చారు. తుని గుండా వెళ్లాల్సిన రైళ్లు ఆగిపోయాయి. తుని వద్ద ఓ వాహనంపై కూర్చుని ముద్రగడ ఆందోళనకు దిగారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆందోళన సాగుతోంది.
ఆందోళన పోలీసుల చేయి దాటిపోయింది. సభా ప్రాంగణంలో నేతలు ఉండిపోయారు. బయట ఏం జరుగుతుందనే విషయం వారికి తెలియదు. దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది సభకు తరలి వచ్చినట్లు అంచనా వేస్తారు. ఆస్తుల ధ్వంసానికి కూడా ఆందోళనకారులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తాడో పేడో తేల్చుకునే వరకు ఇళ్లకు వెళ్లకూడదనే ముద్రగడ పిలుపు పనిచేసి, హింసాత్మక పరిస్థితి దారి తీసింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.
ఉద్యమంలో తాను, తన కుటుంబం ముందుంటుందని పద్మనాభం చెప్పారు. రైలు పట్టాలమీద, రహదారులపైనే ఉద్యమం సాగుతుందని ఆయన చెప్పారు. జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. నాలుగైదు రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.