తుని అల్లర్లతో హై అలర్ట్: విశాఖ, విజయవాడ, అమరావతిలో 144 సెక్షన్
తుని: కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో ఆదివారం నిర్వహించిన 'కాపు ఐక్య గర్జన'తో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ఒక్క తునికే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఉంటాయన్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, అమరావతి తదితర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
కాగా, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివారం రాత్రికే విశాఖపట్నంకు చేరుకున్నాయి. మరికాసేపట్లో ఆ బలగాలన్నీ తుని. పాయకరావుపేటకు చేరుకోనున్నాయి. కాపులకు బీసీల్లో చేర్చాలంటూ, ఈరోజు సాయంత్రంలోగా స్పష్టమైన జీవో రావాలని, లేని పక్షంలో తాను ఆమరణ దీక్షకు దిగుతానంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
ఈ క్రమంలో పరిస్థితులు చేయి దాటపోకుండా ఉండేందుకు గాను కేంద్ర బలగాలను దించుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ప్రభుత్వం నుంచి సోమవారం సాయంత్రానికి స్పష్టమైన ప్రకటన రాని పక్షంలో విజయవాడలో కూడా ఆందోళనకు దిగేందుకు కాపు నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
దీనిపై ఇప్పటికే స్పష్టమైన సమాచారం అందుకున్న పోలీసులు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున మోహరించారు. సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో వేల సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో తుని, అమరావతి, విజయవాడలో ఉద్రికత్త కొనసాగుతోంది. ఏపీ నుంచి అదనపు బలగాలను తరిలిస్తున్నారు. ఇప్పటికే తునికి చేరుకున్న ఉన్నతాధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.