కాపు జాతిని అమ్మకానికి పెట్టానంటారు: జగన్కు ముద్రగడ లేఖ
అమరావతి: కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కీలక వ్యాఖ్యలు చేశారు. స్వయంగా తాను కలవాలనుకుంటున్నప్పటికీ.. పరిస్థితులు దానికి సహకరించట్లేదని చెప్పారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంతో సంబంధం ఉన్న కేసులన్నింటినీ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన రెండోరోజే ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఏ ఒక్క కేసు లేకుండా అన్నింటినీ ఉపసంహరించుకుంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ బిశ్వజిత్ జీవోలను విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో భారీ బహిరంగ సభను నిర్వహించిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగింది. ఈ అల్లర్లలో రత్నాచల్ రైలును కూడా తగులబెట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్పై దాడులు చేశారు.

తుని బహిరంగ సభ జరిగిన 2016 జనవరి నుంచి 2019 వరకు నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. కేసులను ఎత్తివేసినందుకు ముద్రగడ పద్మనాభం.. వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. చెయ్యని నేరానికి కాపులను ముద్దాయిలను చేస్తే అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టిందని, వాటికి మోక్షం కలిగించారని చెప్పారు. ఈ విషయం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
అందరిలాగా తాను అపర కోటీశ్వరుడిని కాదని ముద్రగడ పేర్కొన్నారు. ఇదివరకు చంద్రబాబును గానీ, ఇప్పుడు వైఎస్ జగన్ను గానీ తాను కలిస్తే- కాపు జాతిని అమ్మకం పెట్టి కోట్లాది రూపాయలు, పదవులు తెచ్చుకున్నారని తనపై ఆరోపణలు గుప్పిస్తారని అన్నారు. అలా అనిపించుకోవడం ఇష్టం లేక తాను కలవలేకపోయానని వివరించారు. తనకు జరిగిన అవమానాలు, బాధలు, కష్టాలు, బూతు పురాణాలను దృష్టిలో పెట్టుకుంటే.. భవిష్యత్తులోఎవ్వరైనా సరే ఉద్యమాల పేరు రోడ్డెక్కరని చెప్పారు.
కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులను ఎత్తివేసిన తరువాత- కనీసం కృతజ్ఞతలు తెలుపుకోవడానికైనా తాను కలవలేకపోవడానికి ఇదే కారణమని వైఎస్ జగన్కు చెప్పారు. ఎవరెవరో ఏదో ఒక కారణంతో ముఖ్యమంత్రిని కలుస్తున్నప్పటికీ.. తనకు ఆ అవకాశం లేదని, తాను ఎప్పుడో చేసిన పాపంగా భావిస్తున్నానని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications