కాక పుట్టిస్తున్న కాపు నేతలు - గంటా కేంద్రంగా నయా రాజకీయం : టార్గెట్ ఫిక్స్..!!
ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. తెర పైకి పార్టీలు..తెర వెనుక కీలక వ్యక్తులు వచ్చే ఎన్నికలకు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలపైనా పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు ఏపీలో కాపు నేతలు పార్టీలకు అతీతంగా ఏకం అవుతున్నారు. గత కొంత కాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ సమావేశాలు ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ పార్టీల్లో మార్పులు..కొత్తగా చేరికలతో కాపు నేతల తాజా సమావేశం రాజకీయంగా కీలకంగా మారుతోంది.
కాపు నేతల ఐక్యత వేదికలు - ఎన్నికలే లక్ష్యంగా
ఏపీలోని కాపు నేతల వరుస సామవేశాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. పార్టీలకు అతీతంగా కాపు నేతలు భేటీలు నిర్వహిస్తున్నారు. కొద్ది నెలల క్రితం కాపు నేతలు హైదరాబాద్ - విశాఖ కేంద్రంగా సమావేశం అయ్యారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా.. రాజకీయంగా ప్రాధాన్యత దక్కకుండా చూసుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లోనూ కాపులకు గుర్తింపు దక్కేలా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో ఇప్పుడు జనసేన చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తుతో ఉన్నా..ఈ మైత్రి కొనసాగుతుందా లేక ప్రచారం సాగుతున్నట్లుగా టీడీపీతో జత కడుతుందా అనేది రాజకీయాలను మలుపు తిప్పే అంశంగా మారుతోంది. మెజార్టీ కాపు నేతలు జనసేన వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
గంటా కేంద్రంగా కాపు నేతల సమావేశాలు
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కేంద్రంగా కాపు నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి. కాపు వర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న గంటా..అటు మెగాస్టార్ చిరంజీవితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ప్రజారాజ్యంలోనూ పని చేసారు. ఈ నెల 26న విశాఖలో కాపు నాడు సభకు నిర్ణయించారు. వంగవీటి రంగా వర్దంతి నాడు ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ ను గంటా విడుదల చేసారు. పోస్టర్ పైన రంగాతో పాటుగా చిరంజీవి - పవన్ బొమ్మలు ముద్రించారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ తో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. కన్నా జనసేనలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా విజయవాడలో గంటా నివాసంలో జరిగిన సమావేశంలో కన్నాతో పాటుగా టీడీపీ నేత బోండా ఉమ.. చీరాల నేత ఎడం బాలాజీ పాల్గొన్నారు. ఇది కాపు నేతల సమావేశంగా భావించాల్సిన అసవరం లేదని..కాపు నేతల సమావేశం అయితే మిగిలిన నేతలు పాల్గొనే వారని చెబుతున్నారు. ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని చెప్పుకొచ్చారు.
విశాఖ సభ తరువాత కీలక పరిణామాలు..
ఈ నెల 26న విశాఖ కేంద్రంగా జరిగే సభకు వంగవీటి రాధా కూడా హజరు కానున్నారని తెలుస్తోంది. ఈ సభ ద్వారా కాపు నేతలంతా తమ ఐక్యత చాటేందుకు సిద్దం అవుతున్నారు. వైసీపీ నేతలు మినహా మిగిలిన వారంతా ఈ సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సభ పార్టీలకు అతీతంగా జరుగుతోంది. కానీ, కాపు సమావేశాల్లో పాల్గొంటున్న కొందరు ముఖ్య నేతలు ఇప్పటికే జనసేన వైపు ఆసక్తి చూపిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన నేతలు..మెగా ఫ్యాన్స్ ఇప్పటికే జనసేనకు మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో..ఇప్పుడు కాపు నేతల సమావేశాలు భవిష్యత్ నిర్ణయాల పైన అటు వైసీపీలో.. ఇటు టీడీపీలోనూ చర్చకు కారణమవుతున్నాయి. పొత్తుల పైన ఈ భేటీలు ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, ఈ సమావేశాల పై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.