పవన్ కాపు వ్యాఖ్యల కలకలం: చంద్రబాబుకు రహస్య స్నేహితుడు: వైసీపీ నేతల ఫైర్..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ లోని కాపు నేతల మీద చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాక పుట్టించాయి. కాపు రిజర్వేషన్లను తిరస్కరించిన జగన్ ను ప్రశ్నించే ధైర్యం లేని కాపు నేతలు వైసీపీలో కొనసాగుతున్నారని పవన్ విమర్శించారు. దీని పైన వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చంద్రబాబుకు రహస్య స్నేహితుడుగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్టునే పవన్ చదువుతున్నారని ఆరోపించారు. పవన్ విమర్శల వెనుక ఓర్వలేనితనం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. అసలు పవన కు కాపులను బీసీల్లో కలిపే అంశం మీద అవగాహన ఉందా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. వైసీపీ నేతలు వరుసగా పవన్ మీద చేసిన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
పవన్ వ్యాఖ్యలపై వైసీపీ సీరియస్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీలోని కాపు నేతల మీద తీవ్ర విమర్శలు చేసారు. కాపులకు రిజర్వేషన్లు కావాలని కోరిన వైసీపీలోని కాపు నేతలు..అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ రిజర్వేషన్లు లేవని చెబుతూ.. చంద్రబాబు ఈడబ్ల్యూయస్ రిజర్వేషన్లలో బాగంగా ఇచ్చిన అయిదు శాతం రిజర్వేన్లను జగన్ రద్దు చేసిన ప్రశ్నించే ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. తనకు రాజోలు పర్యటనలో ఒక పెద్దాయన కాపు నేతలు జగన్ ను చూసి భయపడుతున్నారని చెప్పారని చెప్పుకొచ్చారు. దీని పైన వైసీపీ కాపు నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. జగన్ పాలన మీద పవన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు నెలల కాలంలోనే 19 చారిత్రాత్మక బిల్లులను తీసుకొచ్చామన్నారు. ఒకపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న పవన్కు కాపులను బీసీల్లో కలిపే అంశంపై అవగాహన లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం కోసం ఈబీసీ కోటాలో ఐదుశాతం రిజర్వేషన్ ను తీసుకుంటే ... రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్ధేశ్యంతో సీఎం జగన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు రాజా వివరించారు. చాలా విషయాల్లో పవన్ అవగాహనలోపంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు స్క్రిప్ట్ను చదవడం పవన్ కల్యాణ్ మానేయాలని లేదంటే ప్రజలు క్షమించరని రాజా అన్నారు.

చంద్రబాబుకు రహస్య స్నేహితుడిగా..
వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య సైతం పవన్ మీద విమర్శలు చేసారు. చంద్రబాబుకు పవన్ రహస్య స్నేహితుడిగా వ్యవహరిస్తూ, ఆయన తయారు చేసిన స్క్రిప్టునే చదవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అక్రమాలను ఎన్నడూ ప్రశ్నించని పవన్ ఇప్పుడు పనిగట్టుకొని జగన్ను విమర్శించడం వెనుక ఓర్వలేనితనం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 19 చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి పవన్కు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించిన సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మాట తప్పితే, అదే ఉద్దానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 200 పడకల ఆసుపత్రిని కట్టిస్తున్నారన్న విషయం పవన్ మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణు వంద రోజలు పాలన పైన చంద్రబాబు చెప్పిందే పవన్ చెప్పటం కాదని.. బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ చేసారు. తాను ప్రజల సమక్షంలోనే జగన్ వంద రోజుల పాలన మీద చర్చకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications