జగన్ పాదయాత్రకు కాపు సెగ:కాపులను మోసం చేయొద్దంటూ నినాదాలు
కాకినాడ:తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రకు కాపు రిజర్వేషన్ల సెగ తగిలింది. తమ రిజర్వేషన్ల పై జగన్ వైఖరిని నిలదీస్తూ జగన్ పాదయాత్రను కాపు నాయకులు అడ్డుకున్నారు.
కిర్లంపూడి మండలం గోనేడ వద్ద కాపు నాయకులు జగన్ పాదయాత్రను అడ్డుకొని కాపులను మోసం చేయవద్దంటూ నినాదాలు చేయడం, జగన్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడం చేశారు. ఈ సందర్భంగా జగన్ పాదయాత్రకు ఆటంకం కలిగిస్తున్నకాపు నేతలను జగన్ సెక్యూరిటీ సిబ్బంది పక్కకు నెట్టేసేందుకు ప్రయత్నించిన క్రమంలో కొద్దిసేపు కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

శనివారం జగ్గంపేటలో పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లు ఇవ్వలేమంటూ తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, అందుకే తాను హామీ ఇవ్వలేనని జగన్ చెప్పుకొచ్చారు. తాను మాటిచ్చి తప్పలేనని, చేయగలిగే వాటికే తాను హామీ ఇస్తానన్నారు. రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని సుప్రీం కోర్టు చెప్పిందని జగన్ ఈ సభలో గుర్తు చేశారు.
మరోవైపు కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన వ్యాఖ్యలపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశంలో జగన్ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. కాపులను జగన్ తీవ్రంగా అవమానించారని, కాపులకేనా... అసలు మొత్తం రిజర్వేషన్లకు జగన్ వ్యతిరేకమా చెప్పాలని ప్రశ్నించారు. రెట్టింపు నిధులిస్తానంటూ తమపై సవతితల్లి ప్రేమ చూపొద్దన్నారు.
కాపులకు సీఎం చంద్రబాబు ఎక్కడ రిజర్వేషన్లు కల్పిస్తారోనని, జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై ప్రకటనతో కాపులను ఓట్లు అడిగే అర్హత జగన్ కోల్పోయారని ముద్రగడ అన్నారు.












Click it and Unblock the Notifications