కాపు: అందుకే తమిళనాడు 69శాతం, ఆ ఫార్ములా ఏపీలో కుదరదా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కాపులను బీసీలలో చేర్చాలని ఉద్యమం రాజుకుంటోంది. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం నుంచి ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కాపులను బీసీలలో చేర్చాలని ఆ వర్గం వారు డిమాండ్ చేస్తుండగా, బీసీల్లో చేర్చితే ఊరుకునేది లేదని బీసీలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం చర్చకు వస్తోంది. కాపులను చేర్చి, రిజర్వేషన్లను 50 శాతానికి పైగా పెంచాలంటే సవరణ చేయాలని చెబుతున్నారు. తమిళనాడు తదితర రాష్ట్రాలలో అరవై శాతంకు పైగా రిజర్వేషన్లు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం మాట్లాడారు.
తమిళనాడులో బీసీలు 80 శాతానికి పైగా ఉన్నారని, అందుకే 60 శాతం రిజర్వేషన్ పెంచుకునేందుకు సుప్రీం అనుమతించిందన్నారు. 9వ షెడ్యూల్ ప్రకారం పార్లమెంటులో చట్ట సవరణ జరగాలన్నారు. కాపులు ఆందోళన విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు.
కాపులను బీసీల్లో చేర్చే అంశంపై జస్టిస్ మంజనాథన్ కమిషన్ తొమ్మిది నెలల్లో నివేదిక ఇస్తుందని యనమల గురువారం స్పష్టం చేశారు. కమిషన్లోని ఇతర సభ్యుల నియామకం, విధివిధానాలను త్వరలో రూపొందిస్తామన్నారు.
ఈ క్రమంలో కాపులను ఏ కేటగిరీలో చేర్చాలో కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుతం ఏపీలో బీసీ రిజర్వేషన్ కింద నాలుగు కేటగిరీలలో మొత్తం 144 కులాలు ఉన్నాయని చెప్పారు. 27 శాతం బీసీ రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని చెప్పారు. గతంలో ఈ కేటగిరీలో ముస్లీంలకు రిజర్వేషన్లు ఇచ్చారన్నారు.
జూన్ నుంచి కొత్త సచివాలయంలో ఉద్యోగులు పని చేస్తారు
జూన్ నెల నుంచి ఉద్యోగులు కొత్త సచివాలయంలో విధులు నిర్వహిస్తారని మంత్రి నారాయణ వేరుగా చెప్పారు. ఈ నెల 10వ తేదీన తాత్కాలిక సచివాలయ నిర్మాణం కోసం వచ్చిన బిడ్లను ఎంపిక చేస్తామన్నారు. ఆరు నెలల లోపు సచివాలయం పూర్తి చేస్తామన్నారు. 12వ తేదీన ఉదయం నాలుగు గంటల పదిహేను నుమిషాలకు ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయానికి శంకుస్థాపన చేస్తారన్నారు.