కాపులకు రిజర్వేషన్లు: 9 షెడ్యూల్లో చేర్చేవరకు ఆందోళన: ముద్రగడ
కాకినాడ: కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం తేల్చి చెప్పారు.
కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ముద్రగడ పద్మనాభం దఫా దఫాలుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరికి చెందిన ముద్రగడ పద్మనాభం అంటే కాపు సామాజిక వర్గంలో పేరుంది. 1993లోనూ కాపులకు బీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన చేసిన నేపథ్యం ముద్రగడది.
అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన ఆందోళన హింసాత్మకమైంది.నాటి నుంచి నేటి వరకు ముద్రగడ చేపట్టే ఆందోళనా కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతించకపోగా 'హౌస్ అరెస్ట్' చేస్తూ వస్తున్నది. తాజాగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు.