చంద్రబాబు ఎత్తుగడ: ఇటు ముద్రగడ హౌస్ అరెస్ట్, అటు మేయర్ తాయిలం
కాకినాడ నగర పాలక సంస్థల్లో ‘ఎన్నికల’ సంరంభం.. మళ్లీ ‘కాపులకు రిజర్వేషన్’ అంశాన్ని చర్చలోకి తెచ్చింది.
కాకినాడ/ అమరావతి: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అని సామెత. అధికారంలో ఉన్న వారి పరిస్థితి మరీనూ. ఆరు నెలల్లో కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తానని హామీలు గుప్పించి విజయం సాధించి.. తర్వాత దాటవేతకు పాల్పడుతున్న నేపథ్యం ఆంధ్రప్రదేశ్ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఇది తప్పక వర్తిస్తుంది.
2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక చేతులేత్తేసిన తెలుగుదేశం పార్టీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. కాకినాడ నగర పాలక సంస్థల్లో మొదలైన 'ఎన్నికల' సంరంభం.. మళ్లీ 'కాపులకు రిజర్వేషన్' అంశాన్ని చర్చలోకి తెచ్చింది.
కాపులకు తక్షణం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఆందోళన బాట పడుతున్న ఒకవైపు మాజీ మంత్రి - సీనియర్ రాజకీయ వేత్త ముద్రగడ పద్మనాభం ముందుకు వెళ్లకుండా ఆంక్షలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కాపులు తమ కాపు దాటిపోకుండా చూసుకోవాలని తాపత్రయ పడుతున్నది. గత మూడేళ్లుగా పక్కనబెట్టిన కాపు నినాదాన్ని మళ్లీ తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తెరపైకి తీసుకొస్తోంది. తెలుగు తమ్ముళ్లకు రాజకీయాలు తప్ప విలువలు, నిజాయితీ లేదా అని జనాలు చీదరించే పరిస్థితి ఏర్పడింది.
15 రోజులుగా హౌస్ అరెస్ట్లో ముద్రగడ
తునిలో సభ మొదలు కాపులకు రిజర్వేషన్ అమలు చేసేందుకు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆందోళనను అణచివేసేందుకు చంద్రబాబు సర్కార్ అమలు చేయని ‘తంత్రం' లేదు. పోలీసులు ముద్రగడ కుటుంబాన్ని దుర్భాషలాడారని ఆరోపణలు వచ్చాయి. తమ జాతి కోసం ఆందోళన బాటలో సాగుతున్న ముద్రగడను కాపులు కాదనే పరిస్థితులు ఇప్పట్లో లేవు. గత 15 రోజులుగా ముద్రగడ పద్మనాభాన్ని హౌస్ అరెస్ట్కు పరిమితం చేసిన ఆంధ్రప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో గెలిపిస్తే మేయర్ పదవి కాపులకే ఇస్తామన్న ఫీలర్లు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది.
Recommended Video
కాపులపై ఇలా ఉక్కుపాదం అమలు
ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. అదే చినరాజప్ప.. కాపులకు రిజర్వేషన్ అమలుచేసే అంశం వచ్చేసరికి మాట మార్చేస్తారన్న మాట. అదే సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే కాపులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తున్నారు. విపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలు చూపుతారు. మరోవైపు రిజర్వేషన్ కోసం పోరాడుతున్న కాపు నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. కాపుల ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాపులు రోడ్డుపైకి అడుగు పెడితే చాలు నిర్బంధం అమలు చేస్తున్నారు. పోలీసుల నిఘాలోనే కాపులు నిరంతరం గడుపుతున్నారు. అడుగడుగునా ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయి.
పాదయాత్ర కోసం ఆందోళన తీవ్రతరం చేయాలని పిలుపు
తాను పాదయాత్ర చేపట్టిన తనను అడ్డుకోవడంపై ముద్రగడ రకరకాలుగా నిరసన తెలుపుతున్నారు. కిర్లంపూడిలోని తన స్వగృహం నుంచి బయలు దేరి గేటు వద్దకు చేరుకున్న ముద్రగడ పద్మనాభంను పోలీసులు అడ్డగించారు. ‘పదే పదే 2009 గైడ్లైన్స్ అని చెబుతున్నారు.. ఆ గైడ్లైన్స్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పాటించారా' అని ముద్రగడ ప్రశ్నించారు. ‘‘తన చేతికి సంకెళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టి పోలీసులు దగ్గరుండి పాదయాత్రకు నడిపించండి. సంకెళ్లు వేసి మమ్మల్ని జైలుకైనా పంపండి. రోజూ మమ్మల్ని హింసించకండి'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రను అడ్డుకున్నందుకు నిరసనగా నల్ల రిబ్బన్లతో చేతికి సంకెళ్లుగా చుట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పాదయాత్రకు అనుమతించే వరకు కాపులంతా కిర్లంపూడికి తరలి రావాలని గురువారం ముద్రగడ పద్మనాభం నివాసంలో జరిగిన 13 జిల్లాల కాపు సంఘాల జేఏసీ సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు.
కాకినాడ సిటీలో దయనీయంగా టీడీపీ పరిస్థితి?
దీంతో ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై అనుసరిస్తున్న తీరుపై ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. కాపులపై కక్షకట్టినట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. దీంతో టీడీపీ అంటేనే కాపులు రగిలిపోతున్నారు. చంద్రబాబు దగ్గరి నుంచి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల వరకు కాపుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో గెలిపించిన కాపులను అధికారంలోకి వచ్చాక హింసిస్తున్నారని ఆ జాతి అంతా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆ సామాజిక వర్గానికి పూర్తిగా దూరమైన పరిస్థితి ఏర్పడింది. అసలే ప్రభుత్వంపై అసంతృప్తి...ఆపై కాపుల నుంచి వ్యతిరేకత...పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కాపు రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభంపై అనుసరిస్తున్న తీరుతో కాపులంతా మండిపడుతుండటంతో ఏం చేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతున్నారు. పరిస్థితిని ఎలా చక్కదిద్దాలా అన్న దానిపై తర్జనభర్జన పడి గడిచిన ఎన్నికల్లో గట్టెక్కించిన కాపు మంత్రాన్ని ఎంచుకున్నారు. అసలు సంగతి పక్కనబెట్టి మేయర్ పదవిని కాపులకు ఇస్తామని కొత్త పల్లవి అందుకున్నారు.
హైకోర్టు తీర్పుపైనే కాకినాడ సిటీ ఎన్నికల భవితవ్యం
మొన్నటి వరకూ పార్టీలో అంతర్గతంగా ఈసారి బీసీలకు ఇద్దామని చెప్పుకుని వస్తూ ఎన్నికలకొచ్చేసరికి దూరమవుతున్న కాపులను దృష్టిలో ఉంచుకుని వారికే పెద్దపీట వేస్తామంటూ తెరపైకి తెచ్చారు. ఇప్పుడీ ప్రకటనను కాపులెవ్వరూ హర్షించడం లేదు. తమ జీవితాలను నిలబెట్టేది, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టి మేయర్ పీఠం అప్పగిస్తే మారిపోతామా అంటూ కాపులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఏ పార్టీ అయినా ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కోసారి కేటాయిస్తుందని, ఇందులో తెలుగుదేశం పార్టీ గొప్పతనమేమీ లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే మొత్తం 50 డివిజన్లకు ఎన్నికలు జరుగడం లేదు. డివిజన్ల రిజర్వేషన్ల విషయమై హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉన్నది. దీన్ని ఈ నెల 16వ తేదీ తర్వాత విచారిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. కాపుల రిజర్వేషన్ ఆందోళన నేపథ్యంలో కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలు వాయిదా పడాలనే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.