కలలో కూడా: పవన్కళ్యాణ్పై అరుణ, జనసేన హెచ్చరిక
గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేద్ర మోడీల కృషి వల్ల కేంద్ర, రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, పవర్ స్టార్ టీడీపీకి మద్దతు పలుకుతారని కలలో కూడా ఊహించలేదని పలువురు కాపు నేతలు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లాలో టీడీపీ పక్షాన గెలుపొందిన కాపు ప్రజాప్రతినిధులను బుధవారం గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.
ఏ ఒక్క సీటు ఆశించకుండా బీజేపీ, టీడీపీకి సంపూర్ణ మద్దతు పలికిన పవన్ను కాపులు అభినందించాలని టీడీపీ నేత చందు సాంబశివ రావు అన్నారు. కాపులకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తుందని చెప్పారు. మాజీ మంత్రి శనక్కాయల అరుణ మాట్లాడుతూ.. పవన్ టీడీపీకి మద్దతు పలుకుతారని కలలో కూడా ఊహించలేదన్నారు. పవన్ మద్దతివ్వడం అభినందనీయమన్నారు. కాపులు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు.
కాగా, గుంటూరులో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. టీడీపీకి చెందిన కాపు నేతలు పవన్ కళ్యాణ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చెయ్యడం కొత్త తగాదాకు తెర లేపిందట. గుంటూరు జిల్లాలో ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన కాపు నేతలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాపు నేతలకు చెందిన సన్మాన కార్యక్రమం సందర్భంగా గుంటూరులో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ పేరును, ఫొటోను కాపు నేతలు బాగా హైలెట్ చేశారు. ఈ విషయం గుంటూరు జనసేన నేతలకు ఆగ్రహం తెప్పించిందట! పవన్ కళ్యాణ్ను ఒక కులానికి సంబంధించిన నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ఏ మాత్రం సమంజసం కాదని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారట. ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, లేకపోతే తామే ఆ పని చేస్తామని వారు హెచ్చరించారట కూడా.