నిన్న బాబును తప్పుపట్టిన పవన్ కళ్యాణ్! 'తుని' ఘటనపై సీరియస్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు మీడియా ముందుకు రానున్నారు. తుని ఘటన పైన ఆయన ఏం చెబుతారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన ఏం చెబుతారనే విషయమై రాజకీయ వర్గాల్లోను జోరుగా చర్చ సాగుతోంది.
ఈ ఘటన పైన పవన్ కళ్యాణ్ ఆచితూచి స్పందిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఏపీ రాజధాని అమరావతి భూసమీకరణ, సెక్షన్ 8 అంశాల పైన పవన్ కళ్యాణ్ ఘాటుగానే స్పందించారు. ఇప్పుడు ఏపీలో కాపు గర్జన పేరుతో జరిగిన విధ్వంసంపై కూడా ఘాటుగానే స్పందించవచ్చునని అంటున్నారు.
అయితే, ఆయన కాపులను కాకుండా కొందరు నేతలను తప్పు పట్టే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కొంత మద్దతుగా మాట్లాడుతారా అనే చర్చ సాగుతోంది.
రాజధాని భూసమీకరణ పైన టిడిపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత ప్రభుత్వం తన మాట విన్న తర్వాత తగ్గారు. సెక్షన్ 8 విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ నాడు చంద్రబాబును తప్పుబట్టారు. సెక్షన్ 8 పేరుతో తెలంగాణ ప్రజల స్వేచ్ఛను లాక్కోవద్దన్నారు.
తుని ఘటన పైన చంద్రబాబుకు అండగా నిలబడతారా? లేక మండిపడతారా? అనే చర్చ సాగుతోంది. నిన్నటి తుని ఘటనకు.. కాపు నేతలను ప్రధానంగా పవన్ కళ్యాణ్ బాధ్యులను చేయవచ్చునని అంటున్నారు. అదే సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని చంద్రబాబుకు హితవు పలికే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే దాడుల ఘటనను మాత్రం ఆయన తీవ్రంగా ఖండిస్తారని అంటున్నారు.