పవన్ రిక్వెస్ట్ కు సై- ఆ బెడదకు చెక్
ఏపీకి కర్ణాటక ప్రభుత్వం ఆరు కుంకీ ఏనుగులను బహూకరించనుంది. ఈ నెల 21వ తేదీన బెంగళూరులోని వాటిని ఏపీకి అప్పగించనుంది కర్ణాటక. దీనికోసం బెంగళూరులోని విధానసౌధ వద్ద ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దీనికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే హాజరుకానున్నారు.
ఏపీ తరఫున అటవీ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొననున్నారు. ఆయన సమక్షంలో కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరు ఏనుగులను అప్పగించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి ఈశ్వర్ ఖండ్రే వెల్లడించారు.

రంజన్, దేవా, మాస్తి, కరుణ, కృష్ణ, అభిమన్యు అనే ఏనుగులు కర్ణాటక నుంచి ఏపీకి రానున్నాయి. రంజన్, దేవా, మాస్తి, కరుణ ఏనుగులను కొడగు జిల్లాలోని దుబారె ఎలిఫెంట్ క్యాంప్ నుంచి తరలించనున్నారు. కృష్ణ, అభిమన్యును శివమొగ్గ జిల్లాలోని సక్రెబైలు నుంచి తీసుకొస్తారు. తొలుత వాటిని చిత్తూరుకు తరలిస్తారు.
ఇవన్నీ కూడా కుంకీ ఏనుగులు. అంటే- ఇతర ఏనుగుల గుంపును ఇవి నియంత్రించగలుగుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అటవీ ఏనుగులు తరచూ జనావాసాల్లోకి రావడం పంట పొలాలను ధ్వంసం చేస్తోన్న నేపథ్యంలో.. వాటిని నియంత్రించడానికి ఈ కుంకీ ఏనుగులను ఏపీ ప్రభుత్వం తీసుకుని రానుంది.
ఈ ఏనుగులతో పాటు వాటి మావటులు ఏపీకి వస్తారు. కొద్దిరోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం, ఆ ఏనుగుల గురించి అటవీ సిబ్బంది, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన తరువాత వాళ్లు మళ్లీ స్వరాష్ట్రానికి తిరిగి వెళ్తారని తెలుస్తోంది.
ఏనుగుల గుంపు జనావాసాలకు తరలిరావడం కర్ణాటకలో కూడా సర్వ సాధారణమే. చామరాజనగర, కొడగు, హసన్, మైసూరు, చిక్ మగళూరు వంటి జిల్లాల్లో అవి తరచూ గ్రామాలు, పంటపొలాలపై దండెత్తుతుంటాయి. అలాంటి సమస్య ఇక్కడా ఉన్నప్పటికీ- కర్ణాటక ప్రభుత్వం కుంకీ ఏనుగులను ఏపీకి తరలించడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి.
గత ఏడాది ఆగస్టు 8వ తేదీన పవన్ కళ్యాణ్.. బెంగళూరులో సిద్ధరామయ్య, మంత్రి ఈశ్వర్ ఖండ్రేలను కలిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అటవీ సిబ్బందికి, ఏనుగులను నియంత్రించే కార్యకలాపాల్లో శిక్షణ ఇవ్వాలని అప్పట్లో కోరారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈశ్వర్ ఖండ్రే కూడా విజయవాడలో పవన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏనుగుల అప్పగింతకు సంబంధించి ఈ రెండు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదరింది.












Click it and Unblock the Notifications