సర్వ దోషాల పరిహారాలకూ దివ్యౌషధం- ఇదే మంచి సమయం
Karthika Masam 2024: పవిత్ర కార్తీక మాసం ఆరంభమైన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రఖ్యాత శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జాము నుంచే పలు ఆలయాల్లో భక్తులు బారులు తీరి నిల్చున్నారు. భక్తి ప్రపత్తులతో దీపాలను వెలిగించి పూజలు చేస్తోన్నారు.
ఏకాదశి, సోమ, శనివారాల్లో ఉపవాసాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. తెల్లవారు జామున, సాయంత్ర వేళల్లో ఆలయాల్లో దీపాలను వెలిగిస్తుంటారు భక్తులు. తులసికి ప్రత్యేక పూజలు చేస్తారు. గోవులను పూజిస్తారు. ఈ మాసంలో పరమశివుడికి ఆవు పాలతో అభిషేకించి, జాజిపూలతో పూజించితే శివస్థానాన్ని పొందుతారని ప్రశస్తి.

పవిత్ర కార్తీక మాసంలో నదుల్లో పుణ్యస్నానాలను ఆచరించడం, దైవదర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. రోజుకొకటి చొప్పున కార్తీక పురాణంలో ఉండే 30 అధ్యాయాలను పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. శైవక్షేత్రాల్లో కార్తీక పురాణాన్ని పారాయణం చేస్తారు.
కార్తీక మాసం సందర్భంగా ఏటా వేల సంఖ్యలో భక్తులు తిరుపతి కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ కార్తీకమాసంలో కపిలేశ్వరుడిని దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా భక్తుల భారీగా తరలివస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తోన్నారు.
కార్తీకమాసం పొడవునా కపిలేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నవంబరు 4, 11, 18, 25వ తేదీలలో తెల్లవారు జామున 2 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహిస్తారు.
తెల్లవారు జామున 5కు ప్రత్యేక అభిషేకాలు ఆరంభం అయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, సహస్రనామార్చన కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టారు. డిసెంబరు 1వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు చండికేశ్వరస్వామికి అభిషేకం, త్రిశూల స్నానం జరుగనుంది.
సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు లక్షదీపారాధన, పంచమూర్తులైన విఘ్నేశ్వరస్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన నిర్వహించనున్నారు. అనంతరం పంచమూర్తులను వైభవంగా ఊరేగిస్తారు.












Click it and Unblock the Notifications