బాబు ప్రతిపాదనకు కరుణ అభ్యంతరం: అభిమానమని..
చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని పాలార్ నదిపై చెక్ డ్యామ్ నిర్మిస్తామని హామీ ఇవ్వడాన్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల తమిళనాడులోని మూడు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని కరుణానిధి తెలిపారు.
ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వేలూరు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల ప్రజలు తాగునీటి కోసం ఈ నదిపైనే ఆధారపడ్డారని అన్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సందర్బంగా చంద్రబాబు ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాలార్ నదిపై డ్యామ్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కరుణానిధి స్పందించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినా అప్పటి యూపిఏ భాగస్వామ్య పక్షాలైన డిఎంకె, పిఎంకెలు వ్యతిరేకించడంతో ఉపసంహరించుకున్నారని కరుణానిధి గుర్తు చేశారు. 2008లో సుప్రీం కోర్టు ఈ కేసును విచారించి సమస్యను పరిష్కరించాల్సిందిగా కేంద్రానికి సూచించిందని తెలిపారు.
కేంద్ర జల సంఘం ఈ వివాదాన్ని పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లరాదని కేంద్రం సూచించిందని చెప్పారు. తమిళనాడు ప్రజలంటే చంద్రబాబుకు అభిమానముందని, చెన్నై నగరవాసుల తాగునీటి కోసం తెలుగు గంగ ప్రాజెక్టును అభివృద్ధి చేశారని తెలిపారు. అలాంటి చంద్రబాబు పాలార్పై డ్యామ్ ప్రతిపాదన చేశారంటే తనకు నమ్మకం కలగడం లేదని అన్నారు.