భూమాను దెబ్బతీసేందుకే చంద్రబాబు అలా!, మృతికి కారణం బాబే: కరుణాకర్ రెడ్డి
ఆర్థిక ఆయన్ను దెబ్బతీసేందుకే ఈ కేసులు బనాయించారని వ్యాఖ్యానించారు. భూమా కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారని, ఆపై అవమానాలకు గురిచేశారని అన్నారు.
నంద్యాల: టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం ఏపీలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. ఆయన మరణంతో ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ ను సైతం ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
భూమా మరణంతో ఆయన కుటుంబం దిగ్భ్రాంతికి లోనవగా.. ఆయన మరణంపై పలువురు ఆరోపణలు గుప్పిస్తుండటం గమనార్హం. భూమా నాగిరెడ్డి మరణంపై తాజాగా ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి స్పందించారు.
భూమా మరణానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన మృతికి చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. భూమాపై అక్రమ కేసులు బనాయించి ఆయన్ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఆర్థిక ఆయన్ను దెబ్బతీసేందుకే ఈ కేసులు బనాయించారని వ్యాఖ్యానించారు. భూమా కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారని, ఆపై అవమానాలకు గురిచేశారని అన్నారు. మంత్రిపదవి విషయంలోను భూమాను ఒత్తిడికి గురిచేశారని పేర్కొన్నారు.
భూమా అంత్యక్రియలకు చంద్రబాబు హాజరవుతుండటాన్ని కరుణాకర్ రెడ్డి తప్పుపట్టారు. భూమాపై ఎస్సీ, ఎస్టీ, ఎర్ర చందనం కేసులు బనాయించిన చంద్రబాబుకు ఆయన మృత దేహాన్ని సందర్శించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.