సోనియా దురుద్దేశంతోనే రాష్ట్రం ముక్కలు: కావూరి ఫైర్, పవన్ బాధ అదే
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత కావూరి సాంబశివరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తమ ప్రాభవం కోల్పోయిన కారణంగానే ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని విడగొట్టారని ఆరోపించారు.
విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కావూరి మాట్లాడుతూ.. తెలంగాణ ఇస్తే ఆ ప్రాంతం నుంచి అన్ని సీట్లు తమకే వస్తాయని భావించి, తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే దురుద్దేశంతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తాను కోరినట్లు కావూరి పేర్కొన్నారు. రాజకీయాలు చెప్పలేనంతగా చెడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలను ప్రజలు చీదరించుకునే పరిస్థితులు వస్తున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టేనని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే ముందు సీమాంధ్ర నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఇప్పుడు లేదని ఆయన అన్నారు.
పవన్ వ్యాఖ్యలకు అర్థం చెప్పిన కావూరి
లడ్డూలు మంచివేనని కాకపోతే పాచిపోక ముందు ఇస్తే బాగుండని పవన్ అభిప్రాయపడ్డారని కావూరి సాంబశివరావు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్యాకేజీ, ఏపీ అభివృద్ధిలో వెంకయ్యనాయుడుది కీలక పాత్ర అని కొనియాడారు.
ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు అంటే గౌరవం పెరిగిందన్నారు. కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా బీజేపీని విమర్శిస్తున్నారని, టీడీపీ, బీజేపీ బంధాన్ని చెడగొట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కావూరి విమర్శించారు.