తప్పు చేశారు, నిర్ణయం తీసుకుంటాం: టీపై కావూరి
హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరుపై కేంద్ర మంత్రి, సీమాంధ్ర నాయకుడు కావూరి సాంబశివ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తప్పుడు నిర్ణయమని, దానిపై పునరాలోచన చేయాలని అడుగుతున్నామని, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, చేస్తామని ఆయన అన్నారు. తాము ఎంతగా పోరాటం చేసినా విభజనపై వెనక్కి తగ్గడానికి కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేవని, ఈ స్థితిలో సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూడాలని పలు ప్రతిపాదనలు చేశామని, అయినా పట్టించుకోలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
మంత్రివర్గ సమావేశాల్లోకి విభజన నోట్ వచ్చినప్పుడు, ఈ నెల 5వ తేదీన విభజన తీర్మానం వచ్చినప్పుడు తాము తీవ్రంగా వ్యతిరేకించామని ఆయన చెప్పారు. పెద్ద రాష్ట్రం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, దాన్ని విభజించడానికి నోట్ను టేబుల్ ఐటమ్గా తేవడం సరైంది కాదని తాను వాదించానని ఆయన చెప్పారు. ఇలా చేయడం సరి కాదని, దాన్ని చదవడానికి సమయం కావాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇది సూత్రప్రాయమైన నిర్ణయమేనని, మిగతా విషయాలు చూడడానికి జివోఎంను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారని ఆయన వివరించారు.

విభజన చేయకతప్పదనే అభిప్రాయం వారికి ఉందని, ఈ స్థితిలో కూడా రాష్ట్ర విభజనను తాను మంత్రివర్గ సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించానని ఆయన చెప్పారు. విభజన తథ్యమైతే శాస్త్రియంగా చేయాలని, ఒక ప్రాంతానికి న్యాయమూ మరో ప్రాంతానికి అన్యాయమూ చేయకూడదని చెప్పానని ఆయన అన్నారు. అయినా సీమాంధ్రకు అన్యాయం చేశారని ఆయన అన్నారు. విభజన ముసాయిదా బిల్లు, జివోఎం నివేదిక మంత్రి వర్గ సమావేశంలో టేబుల్ ఐటమ్గా రావడాన్ని తాను వ్యతిరేకించినట్లు ఆయన తెలిపారు.
ఏ మంత్రి కూడా చదవడానికి వీలు లేకుండా చేశారని, పర్యవసానాలు ఏమిటో ఆలోచించాలని తాను మంత్రి వర్గ సమావేశంలో చెప్పానని ఆయన అన్నారు. దేశ ప్రజలకు సంబంధించిన విషయం, రాష్ట్రానికి సంబంధించిన విషయం చులకన చేయవద్దని చెప్పినా వారు వినలేదని ఆయన అన్నారు. విభజన అనివార్యమైనప్పుడు హైదరాబాదును కనీసం పదేళ్ల పాటు అంటే ఉమ్మడి రాజధానిగా ఉండేంత కాలం కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని అడిగానని ఆయన అన్నారు.
తమిళనాడులో చెన్నై మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయని, ఆంధ్రప్రదేశ్లో కేవలం హైదరాబాదు, దాని పరిసర ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాయని, సీమాంధ్ర ప్రాంతాలన్నీ హైదరాబాదుపై ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు. హైదరాబాదును తెలంగాణలో అంతర్భాగం చేసి, సీమాంధ్రకు దక్కకుండా చేయడం దుర్మార్గమని కూడా చెప్పానని ఆయన అన్నారు. విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు చెప్పినా వారు వినలేదని ఆయన అన్నారు.
సీమాంధ్రులు బయట సంపాదించి హైదరాబాదులో పెట్టుబడులు పెట్టారని, హైదరాబాద్ అభివృద్ధిలో అందరి పాత్ర ఉందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి చాలా ప్రతిపాదనలు చేశామని ఆయన చెప్పారు. సునామీ కేంద్రాన్ని కూడా హైదరాబాదులోనే ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. అనంతపురం, కర్నూలు జిల్లాలు పూర్తిగా హైదరాబాదుపై ఆధారపడి ఉన్నాయని ఆయన చెప్పారు. ఉద్యోగాల కోసం ఆ జిల్లాల యువత హైదరాబాదు మీద ఆధారపడి ఉందని ఆయన చెప్పారు. ఆ జిల్లాలకు శ్రీశైలం నీళ్లు కావాల్సి ఉంటుందని చెప్పినా వినలేదని, విభజన ఏకపక్షంగా జరుగుతోందని ఆయన అన్నారు. స్నేహితులుగా రెండు విడిపోవడానికి తమ మాటలు వింటే ఆస్కారం కల్పించినవాళ్లం అవుతామని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా, ఎవరూ నష్టపోకుండా చేసే అవకాశం ఉందని చెప్పినట్లు కావూరి తెలిపారు.
మంత్రివర్గంలో ఉండడం వల్ల అవన్నీ చెప్పే అవకాశం తనకు కలిగిందని, ఇన్ని చేసినా విభజన విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన అన్నారు. విభజనపై ఇంకా పోరాటం చేయాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు విభజనకు వ్యతిరేకంగా ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని, ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజనను ఇప్పటికీ తాను వ్యతిరేకిస్తున్నానని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. విభజనకు ముందుకు వెళ్తున్న క్రమంలో కనీసం న్యాయం జరిగేలా చూడాలనే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ వనరులు ఎవరూ దోచుకోలేదని ఆయన అన్నారు. తాము రాజీనామా చేయడం వల్ల విభజన ఆగిపోయే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. కాంగ్రెసును వీడిపోయే శక్తి లేని క్రమశిక్షణ గల కార్యకర్తనని ఆయన చెప్పారు. అయితే, పార్టీ శ్రేయస్సుకన్నా తనకు ప్రజా శ్రేయస్సే ముఖ్యమని కావూరి చెప్పారు.












Click it and Unblock the Notifications