కేబీసీలో పీవీ సింధును టెన్షన్ పెట్టిన ‘వైసీపీ’ ప్రశ్న
‘కౌన్ బనేగా కరోడ్పతి’ 9వ సీజన్ షోలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రూ. 25 లక్షలు గెలుచుకుంది. అయితే ఈ షోలో అడిగిన 13వ ప్రశ్న పీవీ సింధును టెన్షన్ పెట్టింది. ఆ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అమరావతి: 'కౌన్ బనేగా కరోడ్పతి' 9వ సీజన్ షోలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రూ. 25 లక్షలు గెలుచుకుంది. బిగ్బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షోలో శుక్రవారం జరిగిన 30వ ఎపిసోడ్ కు పీవీ సింధు పార్టిసిపేట్గా వెళ్లింది.
తన సోదరితో కలిసి గేమ్ ఆడిన సింధు 12 ప్రశ్నలను దాటుకుని రూ. 12.50 లక్షలను గెల్చుకుంది. అయితే ఈ షోలో అడిగిన 13వ ప్రశ్న పీవీ సింధును టెన్షన్ పెట్టింది. షో చూస్తున్న వారిలో తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తించిన రూ.25 లక్షల ఆ ప్రశ్న.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఏపీలోని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి సింధును బిగ్బీ ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 'వైఎస్సార్' అనే అక్షరాలకు పూర్తి వివరణ ఏంటి? అనే ప్రశ్నను అమితాబ్ సంధించారు.
ఆ ప్రశ్నకు సమాధానంగా ఎ)యువ సత్య రాజ్యం, బి) ఎడుగూరి సంధింటి రాజశేఖర, సి) యూత్ షల్ రూల్, డి) యువజన శ్రామిక రైతు.. అంటూ ఆయన నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ నాలుగు ఆప్షన్స్లో సింధు మొదట 'బి' ఎంపిక చేసుకుంది.
అయితే.. 'బాగా ఆలోచించి సమాధానం చెప్పండి..' అంటూ మరోసారి అమితాబ్ సూచించడంతో సింధు తన సోదరి సాయం తీసుకుంది. చివరికి సరైన సమాధానం 'డి' అని చెప్పి రూ.25 లక్షలు తన సొంతం చేసుకుంది.