కెసిఆర్ మోడీ ఫార్ములా: సగటు మంత్రులు వీరే, శాఖలకు కోత
హైదరాబాద్: మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీ ఫార్ములాను అనుసరిస్తున్నట్లున్నారు. నరేంద్ర మోడీ పాలన శైలిని అధ్యయనం చేసి, తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రుల రిపోర్ట్ కార్డు ఆధారంగా మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉండవచ్చునని అంటున్నారు.
శాఖల మార్పులో కెసిఆర్ మోడీ శైలిని అనుసరించే అవకాశం ఉంది. తొలి ఆరు నెలల పనితీరును అంచనా వేసిన మోడీ సందానంద గౌడను రైల్వే శాఖ నుంచి తప్పించారు. ఇటీవల ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయ సంస్థను ఏర్పాటు చేసే అంశంపై జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా కెసిఆర్ మోడీ పాలనా తీరును పరిశీలించినట్లు చెబుతున్నారు. రిపోర్ట్ కార్డు ఆధారంగా మంత్రివర్గం పనితీరును మోడీ అంచనా వేయడం కెసిఆర్కు నచ్చిందని అంటున్నారు. దీంతో కొంత మంది మంత్రుల్లో గుబులు పుట్టినట్లు తెలుస్తోంది.
మోడీ పద్ధతిలోనే కెసిఆర్ కొంత మంది మంత్రుల శాఖలను మార్చవచ్చునని అంటున్నారు. మంత్రుల్లో ఎవరినీ తొలగించకుండానే శాఖలను మార్చే పనిని ఆయన పెట్టుకుంటారని అంటున్నారు. మంగళవారంనాడు ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. సరాసరి పని తీరును కనబరిచిన మంత్రుల్లో నాయని నర్సింహా రెడ్డి (హోం శాఖ), ఈటెల రాజేందర్ (ఆర్థిక, పౌరసరఫరాల శాఖలు), డిప్యూటీ ముఖ్యమంత్రి మహమ్మద్ మొహమూద్ అలీ (రెవెన్యూ, మైనారిటీ శాఖలు), పి. మహేందర్ రెడ్డి (రవాణా శాఖ), జోగు రామన్న (అటవీ, పర్యావరణ శాఖ), పద్మారావు (ఆబ్కారీ శాఖ) ఉన్నట్లు సమాచారం.
అత్యధిక మార్కులు సాధించినవారిలో టి. హరీష్ రావు (నీటి పారుదల శాఖ), కెటి రామారావు (పంచాయతీరాజ్, ఐటి శాఖలు), పోచారం శ్రీనివాస రెడ్డి (వ్యవసాయ శాఖ), టి. రాజయ్య (ఆరోగ్య శాఖ), జగదీష్ రెడ్డి (విద్యాశాఖ) ఉన్నట్లు తెలుస్తోంది.
నాయని నర్సింహా రెడ్డి ఆరోగ్యం కూడా ఇటీవలి కాలంలో బాగుండడం లేదు. దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావును మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకు హోం శాఖను అప్పగిస్తారని అంటున్నారు. అది కాకపోతే, రోడ్లు, భవనాల శాఖను తుమ్మలకు ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఈటెల రాజేందర్ ఇబ్బంది పడుతున్నారని, దీంతో ఆయన నుంచి ఆ శాఖను తొలగిస్తారని, పౌరసరఫరాల శాఖ మాత్రమే ఈటెల వద్ద ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి తన వద్దనే ఉంచుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఆక్రమిత ప్రభుత్వ భూముల స్వాధీనం, దళితులకు మూడెకరాల చొప్పున భూమి కేటాయింపు అంశాలు అత్యంత ప్రధానమైనవని, దాన్ని మొహమూద్ అలీ సమర్థంగా నిర్వహించలేకపోతున్నారని కెసిఆర్ అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో మంత్రివర్గంలోకి తీసుకుని లక్ష్మారెడ్డికి గానీ జూపల్లి కృష్ణారావుకు గానీ ఆ శాఖను అప్పగించాలని కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.