బీహార్లో పుట్టాడు: కెసిఆర్పై రేవంత్, స్థానికతేంటని..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీహార్లో పుట్టి విజయనగరం వలస వచ్చిన కెసిఆర్.. ఏ స్థానికత ప్రకారం తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ప్రశ్నించారు. ‘విద్యారంగం-ప్రభుత్వ వైఖరి‘పై టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో చర్చా గోష్టి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కక్షపూరితంగా ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వైఖరిపై తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఉద్యమంలో విద్యార్థులకు మొక్కిన నేతలు.. ఇప్పుడు అధికారంలోకి రాగానే వారిని అణచివేస్తున్నారని రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులనుద్దేశించి ఆరోపించారు. తెలంగాణ గాంధీ ప్రొఫెసర్ జయశంకరే నిజమైన తెలంగాణ గాంధీ అని రేవంత్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు వైఖరి ఏకపక్షం: రఘువీరా
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆయన కర్నూలులో జరిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి 95 జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. రాజధాని ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ దోరణీలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
పదేళ్లపాటు హైదరాబాద్ తాత్కాలిక రాజధాని ఉన్నా.. విజయవాడను తిరిగి తాత్కాలిక రాజధానిగా ఎంపిక చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రఘువీరా ప్రశ్నించారు. శివరామకృష్ణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే నివేదికను బహిరంగ పర్చాలని, దానిపై చర్చ జరిపిన తర్వాతే రాజధాని ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.