చంద్రబాబు, కేసీఆర్ దోస్తీ కుదిరింది: ఆనందం, వాటి పైనా ఇలాగే
హైదరాబాద్: ఇరు రాష్ట్రాల నడుమ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నాగార్జున సాగర్ వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. గవర్నర్ వద్ద శనివారం జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఉన్నతస్థాయి భేటీలో సాగర్ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. దీంతో కుడి కాల్వకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడికాల్వ విద్యుత్తు కేంద్రం నుంచి మరో 2 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.
ఈ సమావేశం సహృద్భావన వాతావరణంలో జరగడంతో జల వివాదానికి పరిష్కారం లభించింది. ఇదే కాకుండా పునర్విభజన చట్టంలోని వివాదాస్పద అంశాలుగా ఉన్న వాటి పైన గవర్నర్, కేంద్ర ప్రతినిధుల సమక్షంలో అవసరమైతే రెండు మూడు రోజులు కుర్చొని చర్చించుకొని పరిష్కరించుకుందామని, ఉందులో జాప్యం చేయడం మంచిది కాదని చంద్రబాబు పేర్కొనగా, కేసీఆర్ కూడా అంగీకరించారని సమాచారం.

చంద్రబాబు, కేసీఆర్ల మధ్య చర్చలు సహృద్భావ వాతావరణంలో జరగడం ఇరు రాష్ట్రాలకు ఆనందాన్ని ఇచ్చే అంశం. తెలంగాణలో తెరాస, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇటీవలి వరకు పలు అంశాలు వివాదాస్పదంగా మారాయి. ఇరు రాష్ట్రాల నేతలు పోటాపోటీగా దుమ్మెత్తి పోసుకున్నారు. ఇప్పుడు చర్చల ద్వారా సాగర్ జలాల విషయం కొలిక్కి వచ్చింది.
ఈ నేపథ్యంలో మిగతా సమస్యలను కూడా కూర్చొని చర్చించుకోవాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని చెబుతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలతో సాహా.. ఇరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీడీపీ, తెరాసల నేతలు కూడా చర్చలతో సమస్యలు పరిష్కారవుతాయని చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్లు కూడా పలుమార్లు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. కూర్చొని మాట్లాడుకుందామని, సమస్యలు పరిష్కారమవుతాయని ఇరువురు నేతలు బహిరంగ ప్రకటనలు చేశారు.












Click it and Unblock the Notifications