రేవంత్పై ఎంత పక్కా ప్లాన్ చూడండి: కేఈ, గోయల్ అందుకే వచ్చారు: రఘువీరా
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిలు శుక్రవారం వేర్వేరుగా స్పందించారు.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తమ పార్టీ నేత రేవంత్ అరెస్టు గురించి గంట ముందే చెప్పారంటే ఎంత పక్కా ప్లానింగుతో ఉన్నారో అర్థమవుతోందన్నారు. తాము కష్టకాలంలోను ఏపీలో హామీలను నెరవేర్చుతున్నామని చెప్పారు.
గోయల్ రాజీ కుదిర్చేందుకే వచ్చారు
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ల మధ్య రాజీ కుదిర్చేందుకే వచ్చారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నిప్పులాంటి మనిషే అయితే రేవంత్ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు అందరూ అవినీతిపరులేనని ఆరోపించారు.
బాబు, జగన్లదే బాధ్యత
రాష్ట్రానికి సీమకు చెందిన ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ తమ ప్రాంతానికి న్యాయం జరగడం లేదని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. సీమ వ్యక్తి సీఎంగా ఉన్నా తమ ప్రాంతానికి నష్టమే జరుగుతోందన్నారు.
గుంటూరుకు రాజధాని వెనుక స్వలాభం అని ఆరోపించారు. ఏపీ సర్కార్ నిర్ణయాలతో సీమకు అన్యాయం జరుగుతోందన్నారు. రాయలసీమకు కనీసం హైకోర్టు అయినా కేటాయించాలన్నారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చే బాధ్యత జగన్, చంద్రబాబులదే అన్నారు.
రేవంత్ను ఇరికించారు: రామ్మోహన్ నాయుడు
రేవంత్ రెడ్డిని అక్రమంగా ఏసీబీ కేసులో ఇరికించారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. కేంద్రం పైన ఒత్తిడి తీసుకు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. వేలకోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు చేపడుతున్నా జగన్ దీక్షలు ఎందుకో చెప్పాలన్నారు.