రాబోయే టి అధికార పార్టీ అధ్యక్షుడ్ని: కెసిఆర్ కౌంటర్
హైదరాబాద్: తాను రాబోయే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలకు చురకలు వేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తన జాగీరా అని తెలంగాణ కాంగ్రెసు నేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, సీమాంధ్ర కాంగ్రెసు నేతలు చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డిలు ప్రశ్నిస్తున్నారని, కచ్చితంగా ఇది తన జాగీరే అని వెయ్యిసార్లు చెబుతానన్నారు.
పొన్నాల లక్ష్మయ్య జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన దొంగల ముఠా నాయకుడని విమర్శించారు. సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు వద్దా అని దామోదరను ప్రశ్నించారు. సీమాంధ్ర నేతలకు తెరాస, కెసిఆర్ అధికారంలోకి రావడం ఇష్టం లేదన్నారు. పొన్నాల, దామోదర వంటి తమ మోచేతి కింద నీళ్లు తాగిన వాళ్లు రావాలని చూస్తున్నారని, తెలంగాణను మరింత దోచుకోవచ్చునని చూస్తున్నారన్నారు.
పోలవరం ముంపు బాధితుల పక్షాన తెరాసనే నిలబడిందన్నారు. పొన్నాల, చిరు, దామోదర తానెవరని ప్రశ్నించడం విడ్డూరమన్నారు. రాబోయే అధికార పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నానన్నారు. త్వరలో తాము తెలంగాణలో అధికారం చేపట్టబోతున్నామన్నారు. ఉద్యోగుల విభజనపై పొన్నాల అసలు విషయం చెప్పకుండా తనను ప్రశ్నించమేమిటన్నారు. తాము మూడొంతుల్లో రెండొంతుల మెజార్టీతో గెలుస్తామన్నారు.
వైయస్ హయాంలో, కిరణ్ హయాంలో మంత్రులుగా ఉన్న వీరు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క మాట మాట్లాడలేదన్నారు. తెరాస ప్రభుత్వం వస్తేనే తెలంగాణకు పంపకాలలో అన్యాయం జరగదన్నారు. తెరాస తాము కాపలా కుక్కల్లా పని చేస్తామన్నారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ వాటర్ సమస్యల పైన కాంగ్రెసు నేతలు ఎప్పుడైనా పోరాడారా అని ప్రశ్నించారు. పోలవరంపై తాము 2006 నుండి పోరాడుతున్నామన్నారు.
రాష్ట్ర విభజన బిల్లు సమయంలో ఏం అడగకుండా నోరు మూసుకొని ఇప్పుడు తనను ప్రశ్నించడమేమిటన్నారు. కాంగ్రెసు నేతల వల్లనే హైదరాబాదు పదేళ్లు ఉమ్మడి రాజధాని అయిందని, ఎపి భవన్ కాకుండా పోతోందన్నారు. టి కాంగ్రెసు నేతలకు దమ్ముంటే ఎపి భవన్ తెలంగాణకు తేవాలని, తెలంగాణకు ప్రత్యేక స్టేటస్ తీసుకు రావాలని డిమాండ్ చేశారు. తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, డిజైన్ మార్టాలన్నారు.
తెలంగాణ అవసరాలు తీరాకనే ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులకు నీటిని తరలిస్తామన్నారు. పొన్నాల మంత్రిగా ఉన్నప్పుడు ఒక అసమర్థుని జీవితయాత్రలా ఆయన ప్రయాణం ఉందన్నారు. ఉద్యమం సమయంలో ఆయన అమెరికాలో లేదా ఆసుపత్రిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావో ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెసు నేతలు మాట్లాడలేదని మండిపడ్డారు.
దొరల పాలన అని ఓ పనికిమాలిన ముచ్చటను బయటకు తెచ్చారని, ఇంకా అది ఎక్కడ ఉందన్నారు. తెలంగాణ నా జాగీరో కాదో ప్రజలు నెల రోజుల్లో చెబుతారన్నారు. తెలంగాణ సెక్రటరియేట్లో ఆంధ్రా ఉద్యోగులు అవసరమా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెసు పార్టీయేనని, ఇప్పుడు కాకి గంగలో మునిగినంత మాత్రాన హంస కాదన్నారు. తను చచ్చేదాకా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతానని చెప్పారు. దొంగలెవరో, దొరలెవరో నెల రోజుల్లో తేలనుందన్నారు.