కర్నూలులో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
కర్నూలు: శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం తగ్గిపోతున్నప్పటికీ విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కర్నూలు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.
దీపావళి రోజున విశాఖ తుపాను బాధితులతో గడుపుతా: వెంకయ్య
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాటనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అనుసరిస్తున్నారు. ఆయనలాగే తాను కూడా ఈసారి దీపావళి రోజును విశాఖ తుపాను బాధితులతో కలసి గడుపుతానని తెలిపారు. అందుకోసం ఇవాళ, రేపు విశాఖలోనే ఉంటానని చెప్పారు. మోడీ కాశ్మీర్ వరద బాధితులతో కలసి దీపావళి చేసుకోనున్న విషయం తెలిసిందే.
విశాఖవాసులకు కేంద్రం అండగా ఉంటుందని, ఇళ్లు కోల్పోయిన వారికి కేంద్రం తరపున పక్కా గృహాలు నిర్మిస్తామని వెంకయ్య తెలిపారు. తుఫాను సాయాన్ని కేంద్రం వెంటనే విడుదల చేస్తుందన్నారు. త్వరలో కేంద్ర బృందం తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తుందన్నారు. నష్టాన్ని అంచనా వేస్తుందని తెలిపారు.
ఆర్ అండ్ బీకి రూ. 600 కోట్లకు పైగా నష్టం: శిద్దా
హుధుద్ తుఫాన్తో ఉత్తరాంధ్రలో ఆర్ అండ్ బీకి సుమారు రూ.600 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రవాణా మంత్రి శిద్దా రాఘవ రావు చెప్పారు. వారం రోజులకు పైగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొని వచ్చిన శిద్దా మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో మాట్లాడారు.
మూడు జిల్లాల్లో కలిపి 18 ప్రధాన రోడ్లు తెగిపోయాయన్నారు. రికార్డు స్థాయిలో 24 గంటల వ్యవధిలో రోడ్డు, రవాణా వ్యవస్థను పునరుద్ధరించడం జరిగిందన్నారు. 24గంటల్లో ఆర్టీసీ సర్వీసులను కూడా పునరుద్ధరించా మన్నారు. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందని వివరించారు.
ఒక్క విశాఖ జిల్లాలోనే 18వేల విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. విజయనగరం జిల్లాలో 9475, శ్రీకాకుళం జిల్లాలో 11,675 స్తంభాలు ధ్వంసం అయ్యాయన్నారు. మూడు జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి సుమారు రూ.50వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు చెప్పారు. రాత్రింబవళ్ళు మొత్తం ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో బాధిత ప్రజలకు అన్ని విధాల సహాయ, సహకారాలను అందిస్తున్నారన్నారు.