కెసిఆర్కు మాఫీ చిక్కు, విపక్షాల ఫైర్: దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్: 2013 జూన్ నుండి 2014 జూన్ వరకు లోన్ తీసుకున్న రైతులకు మాత్రమే లక్ష రూపాయల వరకు లోన్ మాఫీ చేస్తామన్న తెరాస ప్రభుత్వం పైన విపక్షాలు మూకుమ్మడి విమర్శలు చేస్తున్నాయి. కెసిఆర్ పైన విపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేవలం ఏడాది లోపు రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం రైతులకు వెన్నుపోటు పొడవడమేనని విమర్శించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితరులు కెసిఆర్ తీరును తప్పు పట్టారు.
ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని జానా రెడ్డి అన్నారు. ఏడాదిలోపు రుణమాఫీ అని చెప్పడం సరికాదన్నారు. రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ చేయకుంటే కెసిఆర్ ప్రభుత్వం అపకీర్తి మూటకట్టుకోక తప్పదన్నారు. మేనిఫెస్టోలో చెప్పినదానికి, ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేదన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డికె అరుణ డిమాండ్ చేశారు. రైతులకు షరతులు లేని రుణమాఫీ అమలు చేయాలన్నారు.

కెసిఆర్ ఎన్నికల హామీలు నెరవేర్చకుంటే తెరాస ప్రభుత్వం రైతుల విశ్వాసం కోల్పోతుందని సిపిఐ మండిపడింది. విద్యుత్ సర్ ఛార్జీలు తొలగించాలన్నారు. రైతులకు ఎనిమిది గంటలపాటు ఉచిత నాణ్య విద్యుత్ ఇవ్వాలన్నారు.
రైతులు రుణాలు తీసుకోవడం నిరంతర ప్రక్రియ అని, రుణమాఫీ చేస్తానని రైతులను తప్పుదారి పట్టించడం సరికాదని డి శ్రీనివాస్ అన్నారు. రుణాలు అన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేస్తే తమ సహకారం ఉంటుందన్నారు. లేదంటే ప్రజలు కూడా సహించరన్నారు. ఒక్క సంవత్సరమే రుణమాఫీ చేస్తానని చెప్పిన దానిని పున సమీక్షించుకోవాలన్నారు.
కెసిఆర్ పైన రైతు సంఘాల నాయకుల మండిపాటు
తెరాస ప్రభుత్వంపై రైతన్నలు భగ్గుమన్నారు. రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఆంక్షలు సరికావన్నారు. నిజామాబాద్ జిల్లాలో తెరాస జెండా దిమ్మెలను కూల్చివేశారు. పలుచోట్ల రాస్తారోకో నిర్వహించారు. ఏడాది లోపు లోన్లనే మాఫీ చేస్తాననడం, లక్ష వరకు మాత్రమే మాఫీ ఉంటుందని చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications