దమ్ముంటే విచారణ చేయాలి: పొన్నాలకు కెసిఆర్ సవాల్
కరీంనగర్: దమ్ముంటే తనపై విచారణ చేయాలని తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు సవాల్ విసిరారు. తనపై ఆరోపణలు చేస్తున్న పొన్నాల విచారణ జరిపి తప్పులుంటే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఏ విచారణకైనా తాను సిద్ధమేనని ఆయన అన్నారు. ఆయన కరీంనగర్ జిల్లాలోని కోరుట్లలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తాను తప్పులు చేసి ఉంటే కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు బతకనిచ్చేవా అని కెసిఆర్ ప్రశ్నించారు.
తమ మేనిఫెస్టో అమలు చేయాలంటే రూ. 8 లక్షల కోట్లు కావాలని పొన్నాల అంటున్నారని.. అది పొన్నాల లెక్కని, ఆయన బతుకంతేనని అన్నారు. కాంగ్రెస్ నేతలు పావలా ప్రజలకిచ్చి, భారాన జేబులో వేసుకుంటారని ఆరోపించారు. పొన్నాల పిసిసి పదవిని కొనుక్కున్నారని, ఎన్నికల్లో టికెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు అతనిపై ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పాత్ర లేదని అన్నారని, కాంగ్రెస్ నాయకులు కూడా అలాంటి పిచ్చి మాటలే మాట్లాడుతున్నారని అన్నారు.
టిఆర్ఎస్పై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని కెసిఆర్ అన్నారు. ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రాంత మంత్రులై ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణలు సహరించారని ఆరోపించారు. రఘువీరా రెడ్డి తెలంగాణ నీళ్లను తీసుకెళుతుంటే డికె అరుణ, పొన్నాల మంగళహారతులు పట్టారని ఆరోపించారు. ఇలాంటి నేతలా తమపై ఆరోపణలు చేసేదని మండిపడ్డారు. తెలంగాణలో నీరు, విద్యుత్ కోతలకు పొన్నాల లక్ష్మయ్యే కారణమని ఆరోపించారు. జాగ్రత్తగా మాట్లాడాలని, లేదంటే అంగీలాగు ఈడ్చి బజార్లో నిలబెడతామని హెచ్చరించారు. తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు మించి రావని అన్నారు. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్ నాయకులు రూ. 180 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, డిప్యూటీ సిఎం పదవిని ఇస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో తాగు, సాగు నీరందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. తమ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి విద్యాసాగర్ రావు, ఎంపి అభ్యర్థి కవితను గెలిపించాలని కోరారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్, టిడిపిలు ప్రజలను మోసం చేశాయని, వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్కే ఓటు వేయాలని ప్రజలను కోరారు.