ఆంధ్రలో మరోసారి కెసిఆర్ ఫ్లెక్సీలు: విధానాలు నచ్చినందుకేనట
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫ్లెక్సీలు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. కెసిఆర్ అనుసరిస్తున్న విధానాలపట్ల ఆకర్షితుడైన వల్లభు శ్రీనివాస్రావు అనే వ్యక్తి ఏకంగా తన సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో కెసిఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
కెసిఆర్కు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ రెండు ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు జిల్లాలో ఆసక్తి రేపాయి. అక్కడి ప్రజలు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని ఆసక్తిగా తిలకించారని వల్లభు శ్రీనివాస్రావు తెలిపారు. అంతే కాకుండా సెల్ఫీలు కూడా తీసుకున్నారని తెలిపారు.
యువత ఎక్కువగా ఈ ఫ్లెక్సీల పట్ల ఆకర్షితులయ్యారని చెప్పారు. ఈ ఫ్లెక్సీలను చూసిన వాళ్లల్లో ఎక్కువ మంది కేసీఆర్కు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నారని, కేసీఆర్ దయవల్లే తమ ప్రాంతం కూడా ప్రగతి బాటలో నడుస్తున్నదని వారు అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
ఇంతకు ముందు ఓసారి కెసిఆర్ ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగులు అభినందిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ చర్యలు చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును అభినందిస్తూ తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
"తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల చీకటి జీవితాలలో వెలుగును ప్రసాదించిన ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గార్కి మా శతకోటి అభివందనములు" అని ఆ ఫ్లెక్సీపై పేర్కొన్నారు.