రహస్యమే! మోడీకి కేసీఆర్ హామీ, కవితకు కోదండ సవాల్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రహస్య అజెండాతోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లారని, భూసేకరణ ఆర్డినెన్స్కు మద్దతిస్తామని ప్రధాని నరేంద్ర మోడీకి భరోసా ఇచ్చి వచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ శనివారం విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను పట్టించుకోకుండా సచివాలయానికి భూమి కేటడాయింపు వంటి అంశాలను మాట్లాడానని ముఖ్యమంత్రి చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు.

లోపల ఒకటి ఉండగా బయటకు మరొకటి చెబుతూ కేసీఆర్, ఎంపీ కవితలు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. భూసేకరణ బిల్లుకు మద్దతిస్తే రైతులు కేసీఆర్కు, తెరాసకు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, తెరాస ఎంపీ కవితల వ్యాఖ్యలకు కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ హయాంలో రైతుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నామో బహిరంగ చర్చకు వారిద్దరితో తాము సిద్ధమని చెప్పారు. తేదీ, వేదికను కిషన్ రెడ్డి, కవితలు నిర్ణయించాలని సవాల్ చేశారు. బీజేపీ, తెరాసలవి రైతు ప్రభుత్వాలే అయితే ఈ ఏడాది రైతు ఆత్మహత్యలు ఎందుకు జరిగాయో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications