పుణ్యాత్ముడే: బాబుపై కేసీఆర్ వ్యాఖ్య, వెంకయ్యకి చెప్పా
హైదరాబాద్: ఉద్యోగుల అంశం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శాసన సభలో సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు.
ఒకప్పుడు ఉద్యోగాలు ప్రభుత్వం సెక్టారులో ఉండేవని, ప్రాపంచీకరణ నేపథ్యంలో ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 7 లక్షల 7వేల 744 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వాటన్నింటిని త్వరలో భర్తీ చేస్తామన్నారు. కేడర్ విభజన పైన కమల్ నాథన్ కమిటీ ఆలస్యం పైన కేంద్రాన్ని పలుమార్లు అడిగామన్నారు.
ఉద్యోగుల విభజన పైన ప్రధానికి పలుమార్లు లేఖ రాశామన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తనను కలిసినప్పుడు కూడా ఇదే చెప్పానని తెలిపారు. ఉద్యోగుల విభజన అయ్యాక.. ఎంతమంది వస్తారో, ఎంతమంది వెళ్తారో తెలుస్తుందన్నారు. విద్యుత్ రంగంలో ఉద్యోగాలు వస్తాయన్నారు. జెన్కోలో ఉద్యోగాలు భారీగా అవసరం పడతాయని చెప్పారు.
తాము రేపో, ఎల్లుండో కొత్త పారిశ్రామిక విధానం ప్రవేశ పెట్టబోతున్నామని తెలిపారు. ఉద్యోగుల పంపిణీ అనంతరం ఉద్యోగాల భర్తీ సమస్య తేలుతుందన్నారు. తాను నిరుద్యోగ యువతకు హామీ ఇస్తున్నానని చెప్పారు. అభ్యర్థుల ఏజ్ బార్కు గత ప్రభుత్వాలే కారణమన్నారు. విద్యుత్ రంగంలో నిరుద్యోగులకు అవకాశం వస్తుందన్నారు.
కమల్ నాథన్ కమిటీ ఉద్యోగుల విషయం తేల్చేస్తే పని సులువు అవుతుందన్నారు. కాంట్రాక్ట్ పద్ధతి తెచ్చిన పుణ్యాత్ముడు ఎవరో అందరికీ తెలుసునని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ఫార్మా, పౌల్ట్రీ రంగాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను ఇప్పటికిప్పుడు తీర్చాలంటే ఎలా అన్నారు.
వైయస్, చంద్రబాబుల వల్లే: ఈటెల
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వైయస్, చంద్రబాబుల కారణంగానే వందల కంపెనీలు, పరిశ్రమలు తెలంగాణలో మూతబడ్డాయని ఆరోపించారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ మూతకు చంద్రబాబే కారణమన్నారు.
నిబందనల మేరకే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నియామకాలు, నిధుల కోసమన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల కేటాయింపుల్లో జాప్యం చేస్తుంటే కుట్ర జరుగుతుందేమోననే అనుమానం కలుగుతోందన్నారు. ఇంకా అధికారుల కేటాయింపు పూర్తి కాలేదన్నారు. ఉద్యోగుల విభజన పైన ఇంత వరకు స్పష్టత లేదన్నారు.
తాము త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లనే నిరుద్యోగం పెరిగిందన్నారు. పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు కాంట్రాక్ట్ ఉద్యోగాలు క్రమబద్దీకరిస్తామన్నారు. విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సీమాంధ్ర పాలకుల వల్ల తెలంగాణలో పరిశ్రమలు మూతబడ్డాయన్నారు.