ఫామ్హౌస్లో రెస్ట్, సూసైడ్స్ ప్రేరేపణే: కెసిఆర్పై జైరాం
మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర మంత్రి జైరాం రమేష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫాంహౌస్లో పొద్దస్తమానం విశ్రాంతి తీసుకుంటూ తెలంగాణలో ఆత్మహత్యలను ప్రేరేపించారని ఆయన కెసిఆర్ను దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత తెరాస తెలంగాణలో కనుమరుగు అవుతుందని అన్నారు. విశ్వసనీయతలేని కెసిఆర్కు అధికారం అప్పగిస్తే ఆయన కుటుంబం మేలును తప్ప తెలంగాణ ప్రజలకు చేసేదేమీ ఉండదని మండిపడ్డారు.
మంగళవారం ఆయన మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్, గోపాల్పేట, మల్దకల్, అయిజ మండలాల్లో పర్యటించారు. కెసిఆర్కు తెలంగాణ సాధించే శక్తి లేదని, పార్లమెంట్లో ఏమాత్రం బలం లేని కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత తనదేనని చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు.
ఫాంహౌస్కు పరిమితమైన కెసిఆర్ తెలంగాణ ఉద్యమం ఉధృతమైనప్పుడే నిద్ర లేచేవారని, కెసిఆర్ వైఖరి వల్లనే అమాయకులు బలిదానాలు చేసుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ అమరుల కోసం హైదరాబాద్లో స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్కు మద్దతునిచ్చి తెలంగాణ పునర్నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు సహకరించాలని ప్రజలను కోరారు.
బిజెపి ప్రధాని అభ్యర్థి పాలన వస్తే దేశ పరిస్థితులు అస్తవ్యస్తంగా మారతాయని, లౌకికవాద వ్యతిరేక శక్తులకు బుద్ధిచెప్పాలని అన్నారు. గద్వాల ప్రాంతంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు కృషి చేస్తామని మల్దకల్ మండల కేంద్రంలో జరిగిన సభలో భరోసా ఇచ్చారు. తెలంగాణ మాత, పిత, నిర్మాత సోనియాగాంధీ అని అన్నారు.