కెసిఆర్ ప్లాన్: ఏపీకి ధీటుగా టి గోదావరి పుష్కరాలు
హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో తొలిసారిగా వచ్చే ఏడాది జరుగబోయే గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా, నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించి ఆధ్యాత్మిక పరిమళాలు విరజిమ్మాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని సిఎం నిర్ణయించారు. తెలంగాణ నలుదిశలా ఆధ్యాత్మిక పరిమళాలు విస్తరించేలా పుష్కరాలకు శృంగేరీ, కంచి తదితర పీఠాధిపతులతోపాటు చినజీయర్స్వామి వంటి ఆధ్యాత్మికగురువులను కూడా ఆహ్వానించాలని చెప్పారు.
వచ్చే ఏడాది జులై 14న సింహరాశిలో బృహస్పతి ప్రవేశించటంతో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల నిర్వహణ ప్రణాళికపై సచివాలయంలో శుక్రవారం సంబంధిత అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. సాంస్కృతిక, దేవాదాయ శాఖల ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, దేవాదాయ శాఖ కార్యదర్శి వెంకటేశ్వర్రావు తదితరులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగబోయే పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, దేశంలో మరెక్కడా జరగని రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని సూచించారు. డబ్బు ఎంత ఖర్చయినా వెనుకాడకుండా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో గోదావరి ప్రవేశించి పారే నదీ తీరప్రాంతాలను ఎంపిక చేసి పలుచోట్ల పుష్కరాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.
బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం తదితర చోట్లనే కాకుండా గోదావరి తీరప్రాంతంలో అవకాశం ఉన్న మరిన్నిచోట్ల వీటిని నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. పుష్కరాల ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధానాలను చర్చించడానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యుల వద్దకెళ్లి చర్చించేందుకు ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ బృందంలో తన గురువు మృత్యుంజయశర్మ, పాలకుర్తి నృసింహ్మ సిద్ధాంతి, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, అష్టకాల రామ్మోహనశర్మ తదితరులతోపాటు బాసర, ధర్మపురి, అలంపూర్, కాళేశ్వరం, యాదగిరి గుట్ట, వేములవాడ ప్రధాన అర్చకులు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
గోదావరి పుష్కరాలు నిర్వహించే ప్రదేశాల్లోని దేవాలయాలకు మరమ్మత్తులు నిర్వహించాలని, వాటివద్దకు చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముంబై, బివాండి, షోలాపూర్, సూరత్లలో ఉండే తెలంగాణవాసులు పుష్కరాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కెసిఆర్ ఆదేశించారు.
హైదరాబాద్తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి పుష్కరాలకు వెళ్లి పుణ్యస్నానాలు అచరించడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రపతితోపాటు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను పుష్కరాలకు ఆహ్వానిస్తామని కెసిర్ తెలిపారు. ఉత్తర భారతంలోనూ గోదావరి పుష్కరాల వేడుకలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, త్వరలోనే పుష్కరాల వెబ్సైట్ను ప్రారంభించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.