కెసిఆర్ పచ్చి సమైక్యవాది, పార్టీకి రాజీనామా: ఏరాసు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పచ్చి సమైక్యవాది అని న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి సోమవారం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ రావడం కెసిఆర్కు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. అందుకే ఆయన రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి అక్టోబర్ 6 వరకు ముఖ్యమంత్రిగా ఉండరన్న కెసిఆర్ వ్యాఖ్యలపై ఏరాసు స్పందించారు. కిరణే సిఎంగా కొనసాగుతారని చెప్పారు.
కిరణ్ కుమార్ రెడ్డి వాదనలో వాస్తవముందన్నారు. విభజన వల్ల వచ్చే సమస్యలను ఆయన వివరిస్తున్నారని చెప్పారు. తమ పార్టీ అధిష్టానం పదే పదే తెలంగాణ నోట్ వస్తుందని వ్యాఖ్యలు చేస్తూ సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు.
విభజన ద్వారా వచ్చే సమస్యలను తీర్చిన తర్వాతనే తెలంగాణకు అధిష్టానం ముందడుగు వేయాలన్నారు. కేంద్రం, అధిష్టానంలో మార్పు రాకపోతే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పారు.
నన్నపనేని ఫైర్
ఆంధ్రాలో మేధావులు లేరని, ఉద్యోగులు లాక్కుంటున్నారన్న కెసిఆర్ పైన టిడిపి శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి వేరుగా మండిపడ్డారు. మేథావులు లేరంటున్న కెసిఆర్ గతంలో టిడిపిలో ఎందుకు చేరారో చెప్పాలన్నారు. కెసిఆర్తో పొత్తు పెట్టుకోవడం వల్ల తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేకపోయారన్నారు.