అంతే దూరం: చంద్రబాబుపై కెసిఆర్ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనను ఆయన వ్యతిరేకించారు. లక్షా 50 వేల కోట్లు రూపాయలు పెట్టి రాజధాని నిర్మిస్తామంటారు, రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ పర్యటన చేస్తామంటారు గానీ వారి రాష్ట్ర విద్యార్థులు వారికి పట్టరా అని అడిగారు. రాజధాని కట్టుకోవడానికి అంత డబ్బు ఉంటుంది గానీ మీ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి స్తోమత లేదా అని చంద్రబాబును అడిగారు. డాంబికాలు, డంబాచారాలు వద్దని సలహా ఇచ్చారు.
కోర్టుకు పోతామని అంటారని, గిల్లికజ్జాలకు దిగుతున్నారని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. తన దృష్టిలో చంద్రబాబు నాయుడు తమకు అత్యంత గౌరవనీయమైన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అని, కర్ణాటక తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాదిరిగానే తాము చంద్రబాబును భౌగోళికంగా పొరుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇల్లు నీకే అంత దూరం అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
బుధవారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ తాము తమ రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే ఇస్తామని ఆయన అన్నారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టి రాజధాని నిర్మిస్తామని చెప్పే చంద్రబాబు విద్యార్థులకు ఫీజులు చెల్లించలేరా అని అడిగారు.
1956కు ముందు ఉన్నవారు మాత్రమే స్థానికులు అని ఆయన చెప్పారు. తాము ఏ విద్యార్థికి కూడా అన్యాయం జరగకుండా చూస్తామని, విద్యాసంవత్సరాన్ని కాపాడుతామని ఆయన చెప్పారు. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను మంత్రివర్గ సమావేశానంతరం కెసిఆర్ వెల్లడించారు. మొత్తం 43 అంశాలపై మంత్రివర్గం చర్చించినట్లు ఆయన తెలిపారు
లక్ష రూపాయల మేర రైతు రుణాలను మాఫీ చేసి తీరుతామని, బంగారంపై తీసుకున్న రైతు రుణాలను కూడా మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. దీనివల్ల 39 లక్షలలకు పైగా రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉండదని, దాని కన్నా మంచి పథకం అమలు చేస్తామని ఆయన అన్నారు. అవసరమైతే తెలంగాణ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు పెంచుతామని ఆయన అన్నారు.
హైదరాబాదులో శాంతిభద్రతల కోసం ఉగ్రనరసింహావతారం దాలుస్తామని ఆయన అన్నారు. ఎపి భూదాన్ చట్టం స్థానంలో తెలంగాణ భూదాన్ చట్టం తెస్తామని ఆయన అన్నారు. హైదరాబాదులో భూకబ్జాదారుల పని పడుతామని ఆయన అన్నారు. నగరంలోని కబ్జాలను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. ఆక్రమణల చెరోల ఉన్న దేవాదాయ భూములను వెనక్కి తీసుకుంటామని ఆయన చెప్పారు. భూకబ్జాలకు పాల్పడితే ఎంతవారినైనా సహించబోమని ఆయన అన్నారు.
తెలంగాణలో వ్యవసాయరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని, కమతాల ఏకీకరణను చేపడుతామని అన్నారు. కేంద్రం సూచనల మేరకు తెలంగాణ రాజముద్రలో మార్పులు చేస్తామని చెప్పారు. 1969 నుంచి అమరులైన తెలంగాణ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందిస్తామని, అమరవీరుల కుటుంబాల్లో అర్హులైనవారు ఉంటే కుటుంబం నుంచి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని ఆయన చెప్పారు. 2001 నుంచి నమోదైన కేసులను మాఫీ చేస్తామని చెప్పారు.