రసమయికి మంత్రి పదవి: కెసిఆర్ మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చకు కెసిఆర్ స్వయంగా అవకాశం కల్పించారు. సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి ఆయన ప్రకటించడంతో ఆ పుకార్లకు రెక్కలు వచ్చాయి.
రాష్ట్రంలో శాసన సభ్యుల సంఖ్య 119 కావడంతో మంత్రుల సంఖ్య 18 వరకు ఉండాలి. ప్రస్తుతం మంత్రివర్గంలో పద్ధెనిమిది మంది ఉన్నారు. దీంతో కొంత మందికి ఉద్వాసన తప్పదా అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 నెలలు కావస్తోంది. ఈనెల 24న జరిగే పార్టీ ప్లీనరీలో తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై సమీక్ష జరుపుతారు. పథకాల అమలుపై అందరి అభిప్రాయాలు తెలుసుకుంటారు.
27న జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ సాధనకు ఏ విధంగా కృషి జరుగుతున్నది, ఏడాదిలో సాధించిన అభివృద్ధిని వివరిస్తారు. ప్లీనరీ, బహిరంగ సభ తరువాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై సైతం ముఖ్యమంత్రి దృష్టి సారిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో ప్రస్తుతం ఒక్క మహిళ కూడా లేరు. శాసన సభ్యులుగా కొందరు మహిళా ఎమ్మెల్యేల పనితీరును పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గంలో ఒక మహిళకు స్థానం కల్పిస్తారని అంటున్నారు.
దేశంలో మహిళా మంత్రి లేకుండా ఉన్న ఏకైక మంత్రివర్గంగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిలిచిపోయింది. దీనిపై విపక్షాలు కూడా విమర్శలు చేశాయి. ఏడాది పాలనలో మంత్రివర్గంలో ఎవరి పనితీరు ఏమిటో ఎమ్మెల్యేల పనితీరు ఏమిటో ముఖ్యమంత్రి చూశారని, దీనికి అనుగుణంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
త్వరలోనే శాసన మండలి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి మండలి సభ్యులుగా ఎన్నిక కానున్నారు. ప్లీనరీ, బహిరంగ సభ, మండలి ఎన్నికల తరువాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయనే భావనతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.