కెసిఆర్ కొత్త మంత్రులు వీరే: ముహూర్తం 16, ఉదయం 11?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గంలో కొత్తగా ఎవరెవరికి స్థానం దక్కుతుందనే విషయంపై ప్రచారాలు సాగుతున్నాయి. ఈ నెల 16వ తేదీన ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలున్నట్లు సమాచారం. 17వ తేదీన విస్తరణ ఉంటుందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. అయితే, ఈ నెల 16వ తేదీననే విస్తరణ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాజభవన్లో కొత్త మంత్రులు ప్రమాణం స్వీకరిస్తారని సమాచారం. కొత్త మంత్రుల కోసం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో ఛేంబర్లను గుర్తించే పనిలో పడ్డారు.
శనివారం ఉదయం ఆయన గవర్నర్ నరసింహన్తో భేటీలో కెసిఆర్ తన మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కెసిఆర్తో కలిసి తెలంగాణ రాష్ట్రానికి 12 మంది మంత్రులున్నారు. మొత్తం 18 మంత్రులు ఉండవచ్చు. అందువల్ల విస్తరణలో మరో ఆరుగురికి మాత్రమే అవకాశం దక్కుతుంది. ఆ పరిస్థితిలో ఆరుగురు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. దానికితోడు, కొందరి పేర్లు ప్రచారంలోకి కూడా వచ్చాయి.
మంత్రివర్గంలో ప్రస్తుతం ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలకు ప్రాతినిధ్యం లభించే అవకాశాలున్నాయి. మహబూబ్నగర్ నుంచి జూపల్లి కృష్ణా రావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస గౌడ్ల్లో ఇద్దరికి అవకాశం దక్కవచ్చునని అంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వర రావుకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. ఆ హామీతోనే తుమ్మల నాగేశ్వర రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్టర్ సమితి (టిఆర్ఎస్)లో చేరారని అంటున్నారు.

వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ లేదా చందూలాల్కు మంత్రి పదవి దక్కవచ్చు. కరీంనగర్ జిల్లా నుంచి కొప్పుల ఈశ్వర్కు అవకాశం వస్తుదని ఖాయంగా చెబుతున్నారు. కానీ తాజా సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవని అంటున్నారు. ఆయన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ వప్గా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నిజానికి, దళిత వర్గానికి చెందిన ఆయనను ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాలని కెసిఆర్ అప్పట్లో భావించారు. కానీ, రాజయ్యకు ఆ పదవి ఇవ్వాల్సి రావడంతో కొప్పుల ఈశ్వర్ అవకాశం కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, కోవా లక్ష్మిల్లో ఒక్కరికి మంత్రి పదవి దక్కుతుంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి, బిగలా గణేష్ గుప్తాల్లో ఒకరిని కెసిఆర్ మంత్రి వర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. తలసాని శ్రీనివాస యాదవ్కు మంత్రి పదవి దక్కుతుందా, లేదా అనేది అనుమానంగానే ఉంది. హైదరాబాద్ నుంచి ఎస్టీ కోటాలో రాముల నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు.
మంత్రి పదవులు దక్కని కొంత మందికి నామినేటెడ్ పదవులు ఇస్తారని అంటున్నారు. విభజన పూర్తయిన కార్పోరేషన్లకు అన్నింటికీ కెసిఆర్ పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. పార్టీ నుంచి మొదటి నుంచీ కృషి చేసినవారికి ఆ పదవులు కట్టబెడుతారని అంటున్నారు.
నిజానికి ఈ నెల 12వ తేదీన మంత్రి వర్గ విస్తరణను చేపట్టే ఆలోచన కూడా కెసిఆర్ చేశారు. అది కాకపోతే 16వ తేదీన చేయాలని అనుకున్నారు. ఆ ప్రకారం ఈ నెల 16వ తేదీన ఆయన మంత్రి వర్గ విస్తరణ చేపడుతారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన శనివారంనాడు గవర్నర్ నరసింహన్ను కలిశారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం జిల్లాల నుంచి కొత్త మంత్రులు ఉంటారని అంటున్నారు. అలాగే, ఇద్దరు మహిళలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నాయి. దీంతో సురేఖకు మంత్రి పదవి దక్కడం ఖాయంగా అనిపిస్తోంది. అలాగే, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డికి నచ్చజెప్పి కోవా లక్ష్మిని కెసిఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు.
కొప్పుల ఈశ్వర్ను ప్రభుత్వ చీఫ్ విప్గా నియమించి నల్లాల ఓదేలు, గంపా గోవర్ధన్, సునీతలను విప్లుగా నియమించే అవకాశం ఉంది. అలాగే, శ్రీనివాస గౌడ్, జలగం వెంకట్రావులకు పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు ఇచ్చే అవకాశాలున్నాయి. వ్యూహాత్మకంగా కెసిఆర్ మంత్రి పదవులు ఇస్తున్నట్లు అర్థమవుతోంది. తనకు సన్నిహితులైనవారికి, గతంలో తన నుంచి హామీలు పొందినవారిని వివిధ పదవుల్లో నియమిస్తూ వివిధ సమీకరణాలను చూసుకుని కొత్త మంత్రులను తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది.
శ్రీనివాస గౌడ్కు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. అయితే, మహబూబ్నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు సీనియర్ ఎమ్మెల్యేగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అదే జిల్లా నుంచి గెలిచిన శ్రీనివాస గౌడ్ను పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించి జూపల్లికి మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. గతంలో మంత్రి పదవి ఇస్తానని హామీ తీసుకున్న స్వామి గౌడ్ను కెసిఆర్ శాసనమండలి చైర్మన్ పదవి ఇచ్చారు. కాగా, ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వర రావుకు మంత్రి పదవి ఇవ్వడానికి వీలుగా ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకటరావును పార్లమెంటరీ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications