ఢిల్లీకి కేసీఆర్, మోడీతో భేటీ: రంగుమార్చమన్న సీఎం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 6, 7వ తేదీల్లో ఢిల్లీలో ఉండనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం గురువారం లేఖ రాసింది. అనుమతి లభించింది. దీంతో గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.
శనివారం మధ్యాహ్నం పదకొండు గంటలకు మోడీతో కేసీఆర్ భేటీ కానున్నారు. మెట్రో పోలీస్ సదస్సు ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించడంతో పాటు కొందరు ఐఏఎస్, ఐపీఎస్ల మార్పిడి కోసం అభ్యర్థించడం, ఇతర అంశాల పైనా ప్రధానిని కలవాలని సీఎం భావిస్తున్నారు. రాష్ట్ర సమస్యల పైన పలువురు కేంద్రమంత్రులను కలిసి చర్చించాలని నిర్ణయించారు.

సింగపూర్ ప్రతినిధి బృందం ఈ నెల 8న ముఖ్యమంత్రిని కలవనుంది. ఇటీవల సింగపూర్ పర్యటనలో చర్చించిన అంశాల ఆమోదానికి ఈ బృందం హైదరాబాదుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్కు తెలుపురంగు వాహనాలు
తన కాన్వాయ్లోని కార్ల రంగును మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కాన్వాయ్లో 6666 నెంబరు గల నలుపు రంగు ఫార్చ్యూనర్ కార్లు ఉన్నాయి. వివిధ భద్రతా కారణాల రీత్యా వీవీఐపీల వాహన శ్రేణి నలుపు రంగులో ఉంటుంది.
అయితే, ఈ నలుపు రంగు తనకు అచ్చిరావడం లేదని, తెలుపు రంగులోకి మార్చాలని కేసీఆర్ నిర్ణయించారని వినికిడి. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో కాన్వాయ్ రంగు మారే అవకాశముంది. అయితే, ప్రస్తుతం ఉన్న కార్లకే రంగు మారుస్తారా? లేక కొత్త కార్లను కొనుగోలు చేస్తారా? అన్న విషయంలో మరింత స్పష్టతరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications